Breaking News

Quad summit అమెరికాలో మోదీకి అపూర్వ స్వాగతం.. నేడు కమలా హ్యారిస్‌తో కీలక భేటీ


క్యాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాకు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘన స్వాగతం లభించింది. వాష్టింగ్టన్ డీసీ విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో భారతీయులు తరలివచ్చారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉండి మోదీతో కరచాలనం కోసం ఎగబడ్డారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో తనకు స్వాగతం పలికి భారతీయ సమాజానికి మోదీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మన ప్రవాసులు మన బలం.. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయం అని పేర్కొన్నారు. అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఈ సమావేశంలో , ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని యోషిహిదే పాల్గొంటారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడం, వాతావరణ మార్పులు, ఇండో-ఫసిఫిక్ ప్రాంతంలో సైబర్ స్పేస్, సెక్యూరిటీ లాంటి అంశాలను ఈ సమావేశంలో క్వాడ్ నాయకులు చర్చించనున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ క్వాడ్ సమావేశం వర్చువల్‌గా నిర్వహించారు. అమెరికా బయలుదేరే ముందు మోదీ ఓ ప్రకటన చేశారు. అమెరికాలో తన పర్యటనతో భారత్‌-అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొవిడ్‌-19, ఉగ్రవాదంపై పోరాటం, వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడి తన పర్యటనను పూర్తి చేస్తానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చిస్తారు. అలాగే సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇరు దేశాల మధ్య సహకారం తదితర అవకాశాలపై చర్చించేందుకు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో గురువారం సమావేశం కానున్నారు. ఐరాస సాధారణ అసెంబ్లీ సమావేశంలో పాల్గొననున్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌, జపాన్‌ ప్రధాని యొషిహైడ్‌ సుగాతోనూ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడనున్నారు. కాగా అఫ్ఘన్‌లో పరిణామాలపై బైడెన్‌తో మోదీ ప్రధానంగా చర్చిస్తారని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా.. మీడియాకు తెలిపారు. అలాగే అమెరికాలోని ఆ దేశ మేజర్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతోనూ మోదీ భేటీ అవుతారని ఆయన చెప్పారు. మరోవైపు అమెరికాకు బయల్దేరిన ప్రధాని మోదీ విమానం పాకిస్థాన్‌ గగనతలం మీదుగా వెళ్లడం విశేషం. తమ గగనతలం మీదుగా మోదీ విమానం వెళ్లేందుకు అక్కడి అధికారులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.


By September 23, 2021 at 07:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-arrives-in-us-to-participate-in-quad-leaders-summit-address-unga/articleshow/86444359.cms

No comments