Breaking News

పెళ్లిలో ఓవరాక్షన్ చేసిన ఆ కలెక్టర్‌కు తగిన శాస్తి జరిగింది!


అధికారుల నుంచి అనుమతి తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుగుతున్న వివాహ వేడుకలో కలెక్టర్ అతిగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 26న త్రిపురలోని వెస్ట్‌ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్‌ శైలేష్ కుమార్ యాదవ్ ఓ పెళ్లిలో ఓవరాక్షన్ చేసిన ఈ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన చర్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో త్రిపుర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. కలెక్టర్ శైలేష్‌కుమార్‌‌ను విధుల నుంచి తప్పించింది. ఈ అంశంపై త్రిపుర న్యాయశాఖ మంత్రి రతన్‌లాల్‌నాథ్‌ మాట్లాడుతూ..‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్‌కుమార్‌కు ఆదివారం ఓ లేఖ రాసిన శైలేష్ కుమార్.. ఏప్రిల్‌ 26నాటి ఘటనపై జరిగే విచారణ నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో విధుల నుంచి తప్పించాలని కోరారు. దీంతో ఆ బాధ్యతలను హేమేంద్ర కుమార్‌కు అప్పగించాం’’ అని పేర్కొన్నారు. ‘నిస్పక్షపాత విచారణ కోసం వెస్ట్‌ త్రిపుర జిల్లా కలెక్టర్‌, డీఎం బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా కోరుతున్నాను’’ అని శైలేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నట్లు ఓ జాతీయ పత్రిక పేర్కొంది. త్రిపురలో కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. పరిమితి సంఖ్యలో అతిథులతో వివాహాలు, వేడుకలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహాలకు కలెక్టర్ నుంచి అనుమతి తప్పనిసరి చేశారు. బెంగళూరుకు చెందిన యువకుడికి త్రిపురకు చెందిన అమ్మాయితో ఏప్రిల్ 26 రాత్రి వివాహం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి శుభలేఖతోపాటు ధరఖాస్తును డీఎం ఆఫీస్‌లో ఇచ్చి అనుమతి తీసుకొన్నారు. పరిమిత సంఖ్యలో అతిథులతో వేడుక జరుగుతుండగా.. రాత్రి 10 గంటల ప్రాంతంలో డీఎం శైలేష్‌ కుమార్‌ యాదవ్‌ పోలీసులతో కళ్యాణ మండపానికి చేరుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ అతిథులను కొడుతూ.. అసభ్య పదజాలంతో దూషించి వారిని ఖాళీ చేయించారు. అడ్డొచ్చిన వారిని అరెస్టు చేయమంటూ విచ్చలవిడిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో వరుడు, పురోహితుడిపై చేయి చేసుకొన్నారు. అధికారులు తమకిచ్చిన అనుమతి పత్రాన్ని ఓ మహిళ చూపించగా.. దాన్ని లాక్కుని చించివేసి ఆమె ముఖంపై విసిరికొట్టారు. అతిథులను అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. ఈ ఘటనపై పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా మండిపడ్డారు. శైలేష్ కుమార్‌ను తొలగించాలని ప్రధాన కార్యదర్శికి బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వధువు కుటుంబంతో త్రిపుర ఎంపీ ప్రతిమా భౌమిక్ వ్యక్తిగతంగా మాట్లాడినట్టు వెల్లడించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత శైలేష్‌ సారీ చెప్పినట్లే చెప్పి మాట మార్చారు. ‘‘తన చర్యలు ఎవరినైనా వ్యక్తిగతంగా బాధిస్తే క్షమించాలి.. కానీ, ఏప్రిల్ 26న రాత్రి తానే ఏదైతే చేశానో అది ప్రజల సంరక్షణ, ప్రయోజనం కోసమే.. ఎవ్వర్నీ నొప్పించాలనేది తన ఉద్దేశం’’ కాదని మీడియా ముందు వ్యాఖ్యానించారు.


By May 04, 2021 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tripura-west-dm-sailesh-yadav-suspended-over-viral-video-of-him-stopping-wedding-midway/articleshow/82381936.cms

No comments