Breaking News

భారత్‌కు బాసటగా ఫార్మ దిగ్గజం.. సంస్థ చరిత్రలోనే అతిపెద్ద విరాళం ప్రకటించిన ఫైజర్


కరోనా సంక్షోభంతో సతమతమవుతోన్న భారత్‌కు పలు దేశాలు, సంస్థలు సాయం చేస్తున్నాయి. తాజాగా, అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్.. భారీ సాయం ప్రకటించింది. 70 మిలియన్ డాలర్లు విలువైన ఔషధాలను భారత్‌కు పంపుతున్నట్టు తెలిపింది. ఫైజర్ చరిత్రలోనే అతిపెద్ద విరాళం కాగా.. భారత కరెన్సీలో ఈ సాయం ఖరీదు రూ.510 కోట్లు. అమెరికా, యూర‌ప్‌, ఆసియాల‌లోని త‌మ డిస్ట్రిబ్యూష‌న్ కేంద్రాల నుంచి ఈ ఔషధాలను భారత్‌కు పంప‌నున్న‌ట్లు ఫైజ‌ర్ చైర్మ‌న్ ఆల్బ‌ర్ట్ బౌర్లా వెల్ల‌డించారు. భారత్‌లోని కోవిడ్ ప‌రిస్థితులు తమను ఆందోళ‌న‌కు గురి చేస్తున్నాయని... అక్కడ ప్ర‌జ‌ల కోసం మేము ప్రార్థిస్తున్నాం అని బౌర్లా పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో భారత్‌తో క‌లిసి సాగుతామని, తమ సంస్థ చ‌రిత్ర‌లో అతిపెద్ద‌ సాయం చేసే దిశ‌లో చాలా వేగంగా ప‌ని చేస్తున్నామ‌ని వివరించారు. భార‌త ప్ర‌భుత్వం క‌రోనా చికిత్స కోసం అనుమ‌తించిన ఔషధాలను ఫైజ‌ర్ ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌లోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ప్రతి కొవిడ్ బాధితులకు త‌మ ఔషధాలు ఉచితంగా అందాల‌న్న ఉద్దేశంతోనే ఈ ప‌ని చేస్తున్న‌ట్లు ఆల్బ‌ర్ట్ తెలిపారు. అవ‌స‌ర‌మైన వారికి ఆ మందులు అందేలా ప్ర‌భుత్వం, ఎన్జీవోల‌తో క‌లిసి ప‌ని చేస్తామ‌ని స్పష్టం చేశారు. అయితే, ‘‘అనుమతి కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా దురదృష్టవశాత్తూ తమ టీకాకు ఇంకా భారత్‌లో ఆమోదం లభించలేదు’’ అని వ్యాఖ్యానించారు. భారత్ సహా అభివృద్ధి చెందిన చాలా దేశాలు తమ అభ్యర్థనలను పక్కనబెట్టాయని తెలిపారు. మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమెరికా చట్టసభల ప్రతినిధులు, సామాజికవేత్తల సూచనలతో ఫైజర్, ఇతర ఫార్మా సంస్థలు ఉదారంగా వ్యవహరించి తాత్కాలికంగా పేటెంట్ హక్కులను వదులుకున్నాయని అన్నారు. ‘‘ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కింద ఆమోదం కోసం భారత్ ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం’’ అని అన్నారు. తక్కువ ధరకు పరిమిత సంఖ్యలో టీకాలు సరఫరా చేయడానికి ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెన్‌కా సంస్థలు సిద్ధంగా ఉన్నప్పటికీ భారత్‌కు అవసరమైన రెండు బిలియన్లకుపైగా డోస్‌లకు చాలా కాలం పడుతుంది. ఇది భారత్‌లో మహమ్మారి నియంత్రణకు ఆటంకంగా మారుతుంది. జన్యుమార్పిడి వేరియంట్లపై కూడా టీకా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు పలు అధ్యయనాలు, నివేదికలు సూచిస్తున్నాయి. కానీ, ప్రజలకు టీకాలు వేయడంలో ఆలస్యం వల్ల వైరస్ మ్యూటెంట్ చెంది వ్యాక్సిన్లను పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


By May 04, 2021 at 11:09AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pharma-giant-pfizer-pledges-lining-up-70-million-worth-of-drug-supplies-to-india/articleshow/82382783.cms

No comments