Breaking News

మొదలైన భారత్ బంద్.. వాటికి మాత్రమే మినహాయింపు


కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఉద్యమానికి శుక్రవారం నాటికి (మార్చి 26) నాలుగు నెలలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రైతులు సంపూర్ణ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన .. సాయంత్రం 6.00 గంటల వరకు కొనసాగనుంది. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమాఖ్య, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎమ్‌) ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మినహా దేశవ్యాప్తంగా బంద్ కొనసాగనుంది. రోడ్డు, రైలు, రవాణా సేవలను నిలిపివేస్తామని, మార్కెట్లను స్తంభింపజేస్తామని , ప్రకటించాయి. అయితే, ఈ బంద్‌కు తాము మద్దతివ్వడం లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకటించింది. శుక్రవారం మార్కెట్లు తెరిచే ఉంచుతామని పేర్కొంది. చర్చల ద్వారానే చట్టాలపై ప్రతిష్ఠంభన వీడుతుందని, అందువల్ల సాగు చట్టాలపై చర్చలు జరపాలని సమాఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ అభిప్రాయపడ్డారు. అటు, రైతుల బంద్‌కు కార్మిక, విద్యార్ధి, ఉద్యోగ సంఘాలు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించాయి. ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్‌లో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే భారత్ బంద్‌లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నాయి. భారత్ బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని రైతు సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా సంమయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి. రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన భారత్ ‌బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, దీనికి సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారని రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు డిపోలకు పరిమితమవుతున్నాయి. అయితే బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ యథావిధిగా కొనసాగుతాయి.


By March 26, 2021 at 06:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/road-and-rail-transport-likely-to-be-hit-due-to-bharat-bandh-today/articleshow/81698557.cms

No comments