ముంబయి: కోవిడ్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి
ముంబయిలోని కోవిడ్-19 ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటల ప్రాంతంలో భందూప్లోని డ్రీమ్స్ మాల్ సన్రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయానికి హాస్పిటల్లో 76 మంది కోవిడ్ రోగులున్నట్టు పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 70 మంది సురక్షితంగా మరో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పేందుకు మొత్తం 23 ఫైర్ ఇంజిన్లను తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్టు డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. మొదటి అంతస్తులోని లెవెల్-3 లేదా 4లో తొలుత మంటలు చెలరేగి ఉంటాయని, తర్వాత చుట్టుపక్కలకు వ్యాపించాయని అన్నారు. అయితే, మాల్లోనే ఆస్పత్రి నిర్వహించడంపై అధికారులు షాక్ అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ముంబయి మేయర్ కిషోరి పెడ్నేకర్ పరిస్థితిని పర్యవేక్షించారు. అంతేకాదు, మాల్లో హాస్పిటల్ నిర్వహించడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. మాల్లో ఆస్పత్రిని చూడటం ఇదే తొలిసారని ఆమె అన్నారు. ఇది చాలా సీరియస్ అంశమని వ్యాఖ్యానించారు. ప్రమాదానికి గల కారణం తెలియదని, దీనిపై దర్యాప్తు సాగుతోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఆస్పత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. తొలుత మంటలు అదుపులోకి వచ్చినా.. శుక్రవారం ఉదయం మరోసారి ఆస్పత్రి వెనుక భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో వాటిని అదుపుచేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఆస్పత్రిలోని మొత్తం 70 మంది రోగులను ములంద్ జంబో సెంటర్, ఫోర్టిస్ హాస్పిటల్కు తరలించినట్టు బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకానీ తెలిపారు.
By March 26, 2021 at 07:21AM
No comments