Breaking News

ఉద్యోగం వచ్చిందని కంపెనీ నుంచి ఫోన్.. మరొకరికి ఇవ్వమన్న ఇంజనీర్.. విషాదం


కరోనా కారణంగా ఉద్యోగం పోయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అప్పులపాలయ్యాడు. కొడుకు బాధ చూడలేని తల్లిదండ్రులు సొంతూరులో భూమిని విక్రయించి అప్పులు తీర్చారు. కానీ చిన్నమొత్తంలో ఆన్‌లైన్ యాప్‌లో తీసుకున్న రుణం అతనికి మనశ్శాంతి లేకుండా చేసింది. తననో డిఫాల్టర్‌గా ముద్రవేసి తన స్నేహితులు, బంధువులకి మెసేజ్‌లు పంపించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అదే సమయంలో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందని కంపెనీ నుంచి ఫోన్ వచ్చినా మరొకరికి ఇచ్చేయండంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ అత్యంత విషాద ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. జిల్లా మంగళగిరికి చెందిన సునీల్(29) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఆరునెలల కూతురితో కలసి రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సునీల్ ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఆన్‌లైన్ యాప్‌లలో రుణం తీసుకుని వెంటనే తీర్చే సునీల్.. ఇబ్బందుల కారణంగా కట్టలేకపోయాడు. గతంలో మరో రూ.6 లక్షల అప్పు ఉండడంతో కొడుకు ఇబ్బందులు తెలుసుకున్న తల్లిదండ్రులు సొంతూరులో భూమిని అమ్మేసి మూడు నెలల కిందట అప్పు తీర్చారు. యాప్‌లో తీసుకున్న రుణం కట్టలేకపోవడంతో సంస్థ ప్రతినిధులు వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు. 30 శాతం వడ్డీ... ఆ వడ్డీకి మళ్లీ వడ్డీ వేయడంతో రుణం తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో యాప్ ఏజెంట్లు అతని ఫోన్‌‌లోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరికీ సునీల్ డిఫాల్టర్ అంటూ మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించారు. ఆ విషయం తెలిసి సునీల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అందరి ముందు డిఫాల్టర్‌ అనిపించుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైనట్లు బుధవారం మధ్యాహ్నం సునీల్‌కి ఫోన్ వచ్చింది. అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన సునీల్.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. ఆ ఉద్యోగం మరొకరికి ఇవ్వండని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదే రోజు రాత్రి భోజనం చేసేందుకు గది నుంచి భర్త బయటకు రాకపోవడంతో భార్య కిటికీలో నుంచి చూసి షాక్‌కి గురైంది. భర్త ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆన్‌లైన్ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. Also Read:


By December 18, 2020 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-software-engineer-commits-suicide-over-online-loan-provider-harassment/articleshow/79791134.cms

No comments