Breaking News

ఆరు నెలలకు సరిపడా సామాగ్రి.. 12వేల ట్రాక్టర్లతో ఢిల్లీకి బయలుదేరిన రైతులు


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి రైతులను చర్చలకు కేంద్రం ఆహ్వానించింది. ఇప్పటికైనా ఉద్యమాన్ని ఆపి సంప్రదింపులకు రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞ‌ప్తి చేశారు. ఆందోళనలతో సామాన్యులు, ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అనుమానాలను పక్కనబెట్టి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా.. కేంద్ర మంత్రి తోమర్ వ్యాఖ్యలపై రైతు సంఘాలు స్పందించాయి. జరపాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే అధికారికంగా చెప్పాలని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయిత్ అన్నారు. చట్టాలు రద్దు మినహా మరే షరతులకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. తమతో చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరపాలనుకుంటున్నారో రైతులకు చెప్పాలన్నారు. గతంలో జరిగిన చర్చలకు అధికారికంగానే ఆహ్వానించారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే, సమన్వయ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ మూడు చట్టాలు రద్దు చేసేదాకా ఇంటికి తిరిగి వెళ్లేది లేదని ఆయన తెగేసి చెప్పారు. తదుపరి చర్చల కోసం ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానమూ అందలేదన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌లు దిగ్బంధిస్తామని, తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు, ఉద్యమానికి మద్దతుగా 50వేల మందికిపైగా రైతులు 12 వేల ట్రాక్టర్లతో పంజాబ్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఆరు నెలలకు సరిపడా సామాగ్రితో రైతులు ఢిల్లీ బయలుదేరినట్టు మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధ్యక్షుడు సత్నామ్ సింగ్ పన్ను తెలిపారు. చావోరేవో తేల్చుకోడానికే ఢిల్లీ వెళ్తున్నామని ఉద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గము కాబట్టి మమ్మల్ని ఎలా చంపాలో మోదీ ప్రభుత్వం నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. పంజాబ్, హరియాణాల నుంచి వేలాదిగా తరలివస్తున్న రైతులు సింఘు సరిహద్దు వద్ద డిసెంబరు 12 సాయంత్రం కలుసుకోనున్నారు. నేడు టోల్ ప్లాజాలను దిగ్బంధించి, జిల్లా అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు.


By December 12, 2020 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/50000-more-farmers-on-1200-tractors-carrying-enough-food-head-to-delhi-to-join-protest/articleshow/79690361.cms

No comments