Breaking News

Hyd:బెంజ్ కారు బీభత్సం కేసులో షాక్.. హత్య కేసులో జైలుకి..


హైదరాబాద్‌లో బెంజ్ కారు బీభత్సం కేసులో కారు నడిపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి పోలీసులు షాకిచ్చారు. లైసెన్స్ రద్దయినా కారు నడపడమే కాకుండా సిగ్నల్ జంప్ చేసి మరీ బైక్‌ని ఢీకొట్టి ఒకరి మృతికి కారణమవడంతో మర్డర్ కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా దుర్గాపురానికి చెందిన కాశీవిశ్వనాథ్(29) కుటుంబం నగరంలోని బాచుపల్లిలో నివాసముంటోంది. విశ్వనాథ్ పంజాబ్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో వర్క్‌ ఫ్రమ్ హోం కారణంగా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు. రెండు రోజుల కిందట జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో తన స్నేహితుడు కౌశిక్‌తో కలసి ఫుల్లుగా మద్యం తాగిన విశ్వనాథ్ అక్కడి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ పబ్ మూసివేయడంతో కూకట్‌పల్లి వైపు బయలుదేరాడు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సైబర్ టవర్స్ వద్ద సిగ్నల్ జంప్ చేసి మరీ బైక్‌పై వెళ్తున్న దంపతులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఒడిశాకు చెందిన గౌతమ్‌దేవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య శ్వేత తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితుడు కాశీ విశ్వనాథ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. రెండేళ్ల కిందట 2018లో డ్రంకెన్ డ్రైవ్‌లో కాశీ విశ్వనాథ్ పోలీసులకు దొరికిపోయాడు. అప్పుడే అతని లైసెన్సును రద్దు చేసినట్లు తేలింది. లైసెన్స్ లేకపోయినా వాహనం నడపడం, మద్యం మత్తులో సిగ్నల్ జంప్ చేసి మరీ యాక్సిడెంట్ చేసి ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైన కాశీ విశ్వనాథ్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే నిందితుడు నడిపిన కారు ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కొడుకుదిగా తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు పేరిట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం.. ప్రమాదంలో చనిపోయిన గౌతమ్‌దేవ్‌కి గతేడాది శ్వేతతో వివాహమైంది. గౌతమ్ సికింద్రాబాద్‌లోని ఓ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తుండగా.. శ్వేత మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. తన సోదరుడి వివాహం నిశ్చయం కావడంతో ఈ నెల 25న ఒడిశా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా పెళ్లి షాపింగ్ చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా సైబర్ టవర్స్ వద్ద కారు ఢీకొని గౌతమ్ ప్రాణాలు కోల్పోయాడు. శ్వేత ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకుని హైదరాబాద్ వచ్చిన గౌతమ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో కుమారుడి మరణం తీవ్ర విషాదం నింపింది. Also Read:


By November 14, 2020 at 11:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-car-accident-accused-charged-under-murder-case/articleshow/79220075.cms

No comments