Breaking News

ఓటమిపై స్వరం మార్చిన ట్రంప్.. కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు!


ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని, తాను ఓడిపోలేదంటూ మంకుపట్టుతో ఉన్న అమెరికా అధ్యక్షుడు .. బెట్టు సడలిస్తున్నట్టే ఉంది. ఇన్నాళ్లూ ఓటమిని ఒప్పుకోడానికి నిరాకరించిన ట్రంప్.. తాజాగా, స్వరం మార్చారు. వైట్‌హౌస్‌ రోజ్‌ గార్డెన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. తదుపరి ప్రభుత్వం ఎవరిదనేది కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ గురించి కూడా ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు అమెరికాలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ప్రసక్తే లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని, వైరస్‌ను నివారణకు తీసుకునే నిర్ణయాలు సమస్యను మరింత జటిలం చేసేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ వల్ల రోజుకు 50 బిలియన్‌ డాలర్లు నష్టపోయే ప్రమాదం ఉందని, వేలాది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోసారి లాక్‌డౌన్ అమలు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని పునరుద్ఘాటించారు. మా ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్‌వైపు మళ్లదు.. అయితే భవిష్యత్‌లో ఏదైనా జరగొచ్చన్నారు. వచ్చేది ఏ ప్రభుత్వమో ఎవరికి తెలుసు? దానికి కాలమే సమాధానం చెబుతుంది అని పరోక్షంగా ఓటమిని అంగీకరించారు. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్ధి జో బైడెన్‌ అధ్యక్ష పీఠానికి అవసరమైన ఎలక్టోరల్ ఓట్లను సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం తన ఓటమిని ఒప్పుకోవడంలేదు. ఎన్నికల్లో మోసపూరితంగా వ్యవహరించి, అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. న్యాయస్థానాలలోనూ దావాలు వేసి న్యాయపోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


By November 14, 2020 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-elections-2020-time-will-tell-says-donald-trump-comes-closest-yet-to-admitting-defeat/articleshow/79220274.cms

No comments