Breaking News

దేశంలో 9 లక్షలు దాటిన కరోనా బాధితుల సంఖ్య.. రాష్ట్రాల వారీగా కేసులు ఇలా..


భారత్‌లో కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. 8 లక్షల కేసులను దాటిన మూడు రోజుల వ్యవధిలోనే దేశంలో మరో లక్ష కేసులు నమోదు కావడం కోవిడ్ తీవ్రతకు అద్దం పడుతోంది. సోమవారం ఒక్క రోజే మన దేశంలో 28,600కిపైగా కొత్త కేసులు నమోదు కాగా.. 538 మరణాలు సంభవించాయి. గత వారం మన దేశంలో కేసులు, మరణాలు ఎక్కువగా సంభవించాయి. జులై 6-12 తేదీల మధ్య 1.83 లక్షల కేసులు.. 3466 మరణాల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అంటే సగటున రోజుకు 26,100 కేసులు, 495 మరణాలు నమోదయ్యాయి. సోమవారం నమోదైన 28,648 కొత్త కేసులతో కలిపితే మన దేశంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 9,07,041కి చేరింది. 538 మరణాలను కలిపితే మొత్తం కరోనా మృతుల సంఖ్య 23,695కి చేరింది. 9 లక్షల మంది కరోనా బాధితుల్లో ఇప్పటికే 5.7 లక్షల మందికిపైగా కోలుకోగా... దేశంలో ప్రస్తుతం 3.12 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం 29,271 కొత్త కేసులు నమోదు కాగా.. ప్రతి సోమవారం లాగే ఈ సోమవారం కూడా కేసులు కొద్దిగా తగ్గాయి. కానీ ఆంధ్రప్రదేశ్ (1935 కేసులు)తోపాటు యూపీ (1664), గుజరాత్ (902), మధ్యప్రదేశ్ (575), పంజాబ్ (357), ఛత్తీస్‌గఢ్ (184) రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఏపీలో సోమవారం ఒక్క రోజే కరోనా బారిన పడి 37 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 365కి చేరింది. సోమవారం ఆంధ్రాలో 19,247 శాంపిళ్లను పరీక్షించారు. తెలంగాణలో సోవారం 1550 కొత్త కేసులు నమోదు కాగా.. 9 మంది మరణించారు. హైదరాబాద్‌లో 926 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 212 కొత్త కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 36,221కి చేరింది. ప్రస్తుతం 12,178 యక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా విజృంభణ తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో సోమవారం కొత్త 6497 కేసులు నమోదయ్యాయి. గత ఆరు రోజుల్లో మహారాష్ట్రలో నమోదైన తక్కువ కేసులు ఇవే కావడం విశేషం. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,924కి చేరింది. ముంబైలో సోమవారం 1158 కేసులు నమోదు కాగా.. మహానగరంలో మొత్తం కేసుల సంఖ్య 1.05 లక్షలు దాటింది. ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరణాల సంఖ్య 40గా నమోదైంది. కర్ణాటకలో 2738 కేసులు నమోదు కాగా.. బెంగళూరులోనే 1315 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 73 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోగా.. బెంగళూరులో ఇప్పటి వరకూ లేని విధంగా 47 మంది చనిపోయారు. తమిళనాడులో 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 48 వేలు దాటింది. తమిళనాట మొత్తం కరోనా మరణాల సంఖ్య 2032కి చేరింది. చెన్నైలో 1140 కొత్త కేసులు నమోదు కాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో 16,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


By July 14, 2020 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-cases-in-india-crosses-9-lakh-mark-states-wise-tally-here/articleshow/76951510.cms

No comments