Breaking News

హైదరాబాద్: కోడలికి మామ లైంగిక వేధింపులు.. ఆత్మహత్య


కూతురి వయసున్న కోడలిపై కన్నేశాడు మామ.. లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. మామ శాడిజాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినా.. సర్ధిచెప్పి మళ్లీ కాపురానికి పంపించారు. అప్పటికీ పద్దతి మార్చుకోని ఆ కామాంధుడు.. మళ్లీ టార్చర్ పెట్టాడు. ఇక వేధింపులు భరించలేక మనస్తాపంతో ఉరి వేసుకుంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బషీర్‌బాగ్‌లోని పూల్‌ బాగ్‌కు చెందిన ప్రియాంక.. లోయర్‌ ట్యాంక్‌బండ్ గాంధీనగర్‌కు చెందిన రమేష్‌‌లు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకున్నారు. ఏడు నెలల కూతురు ఉంది.. జీవితా సాఫీగా సాగిపోతోంది. ఇంతలోనే రమేష్ తండ్రి వెంకటేష్ విలన్‌లా మారిపోయాడు.. కోడలిపై కన్నేశాడు. ప్రియాంకను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక.. ఆమె తన కుటుంబసభ్యులకు విషయాన్ని చెప్పింది. ఇరు కుటుంబాల పెద్దల్ని పిలిపించి పంచాయితీ పెట్టారు. పెద్దలు మాట్లాడి తండ్రిలాంటివాడని నచ్చచెప్పి అత్తారింటికి పంపారు. రమేష్‌ బుధవారం భార్య ప్రియాంక, కూతురును పూల్‌బాగ్‌లోని అత్తింట్లో వదిలి వెళ్లాడు. పూల్‌బాగ్‌లోని జేఎన్‌ఎన్‌ యూఆర్‌ఎం ప్రభుత్వ క్వార్టర్స్‌ రెండో అంతస్తులో ఆమె తల్లిదండ్రులు ఉండగా.. మూడో అంతస్తులో ఆమె అన్న నివాసం ఉంటున్నారు. గురువారం అందరూ ఎవరి పనులు మీద వాళ్లు బయటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియాంక కొద్దిసేపు భర్తతో ఫోన్‌లో మాట్లాడింది. తర్వాత గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా తలుపు గడి పెట్టి ఉంది.. కిటికీలో నుంచి చూసి షాకయ్యారు. ప్రియాంక ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తలుపులు బద్దలుకొట్టి ఆమెను దింపగా అప్పటికే చనిపోయింది. ఆమె తండ్రి ఫిర్యాదుతో సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


By March 06, 2020 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/women-suicide-after-father-in-law-sexual-harassment-in-hyderabad/articleshow/74504828.cms

No comments