Breaking News

ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంపై మెగాస్టార్ చిరు ప్రశంసలు


మహిళల భద్రత కోసం జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా ముసాయిదా బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఆమోదం కూడా తెలిపారు. ఈ నిర్ణయాన్ని మెగాస్టార్ స్వాగతించారు.. జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ముఖ్యంగా మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతోన్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. దిశ సంఘటన మన అందర్నీ కలిచివేసింది, ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ లో తొలి అడుగులు పడడం హర్షణీయం’అన్నారు. ‘సీఆర్పీసీ(CRPC) ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువ పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌళిక సదుపాయాల్ని కల్పించడంతో పాటు ఐపీసీ(IPC) ద్వారా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం ద్వారా నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది’అన్నారు మెగాస్టార్. మెగాస్టార్ రెండు నెలల క్రితం ఏపీ సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్‌ శాలువాతో సత్కరించారు. జగన్‌, చిరంజీవి దంపతులు కలిసి భోజనం చేశారు. తర్వాత ఇద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. చిరంజీవి తాను నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని జగన్‌ను కోరారు.


By December 12, 2019 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/megastar-chiranjeevi-welcomes-ap-govt-decision-on-criminal-law-amendment-bill-2019-for-women-safety/articleshow/72484735.cms

No comments