Breaking News

తెలంగాణపై జగన్ ఎఫెక్ట్.. సరిహద్దు జిల్లాల్లో మద్యం దుకాణాల కోసం భారీ పోటీ


తెలంగాణలో మద్యం దుకాణాల కోసం అక్టోబర్ 9 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్ 16తో దరఖాస్తు గడువు ముగియనుంది. దరఖాస్తు చేస్తున్నవారు నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2 లక్షలు డీడీ చెల్లిస్తున్నారు. ఈ నెల 18న ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా తీయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో వ్యాపారులు పోటీ పడుతున్నారు. సోమవారం ఒక్కరోజే 6711 దరఖాస్తులు వచ్చాయి. ఏపీలో మద్యం అమ్మకాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగుతుండటం.. లిక్కర్ షాపులను సర్కారే నిర్వహిస్తోండటంతో.. దాని ప్రభావం పొరుగున ఉన్న జిల్లాలపై పడింది. ఆంధ్రాలో ఒక వ్యక్తి గరిష్టంగా మూడు మద్యం బాటిళ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం ధరలను కూడా పెంచారు. రానురానూ ఏపీలో మద్యం దొరకని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఆంధ్రా సరిహద్దున ఉన్న ఆబ్కారీ డివిజన్ నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన వ్యాపారులు ఈ డివిజన్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు ఆనుకొని ఉండే ఖమ్మం జిల్లాలో దరఖాస్తుల కోసం వ్యాపారులు పోటీపడ్డారు. కర్నూలు జిల్లాకు ఆనుకొని ఉండే మహబూబ్‌నగర్‌ డివిజన్‌లో ఈ పరిస్థితి లేకపోవడం గమనార్హం. హైదరాబాద్‌ డివిజన్‌లోనూ వ్యాపారుల నుంచి పెద్దగా పోటీ లేదు. రంగారెడ్డి డివిజన్‌లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మొత్తానికి తెలంగాణపై కూడా జగన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది.


By October 15, 2019 at 10:57AM


Read More https://telugu.samayam.com/telangana/news/ys-jagan-effect-on-telangana-nalgonda-excise-division-has-heavy-competition-for-liquor-shops/articleshow/71591813.cms

No comments