Breaking News

రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ఒంటరిగా 122 కిలోమీటర్ల ప్రయాణించిన సీఎం.. కారణం ఇదే!


తన రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఓ ముఖ్యమంత్రి పెద్ద సాహసమే చేశారు. ఏకంగా బైక్‌పై 122 కిలోమీటర్లు దూరం ఒంటరిగా ప్రయాణించి ఆశ్చర్య పరిచారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమాఖండూ వినూత్నంగా ప్రయత్నించారు. స్వయంగా బైక్‌పై నడుపుకుంటూ వెళ్లిన విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాసిఘాట్‌ బైక్‌ రైడింగ్‌, సాహస క్రీడలకు ప్రత్యేకత. ఈ ప్రాంతంలో పర్యటకులను మరింత ఆకర్షించేందుకు సీఎం రంగంలోకి దిగారు. స్వయంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650పై పర్యటనకు బయలుదేరారు. ప్రసిద్ధి పర్యాటక ప్రాంతం యుంకియాంగ్‌ నుంచి పాసిఘాట్‌ వరకు 122 కిలోమీటర్లు ప్రయాణించారు. దీనికి సంబంధించి వీడియోను పోస్ట్‌ చేసిన ఆయన పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రయాణం అని వివరించారు. ‘బైక్‌ రైడింగ్‌, సాహస క్రీడలకు ఇది మంచి ప్రదేశం.. ఈ మార్గంలో సియాంగ్ వ్యాలీ, ఆది గ్రామాలలో సుందరమైన దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.. అక్టోబర్ 13న ఉదయం 8 గంటలకు యుంగ్‌కియాంగ్‌ నుంచి ప్రారంభించి, పాసిఘాట్‌ విమానాశ్రయానికి 10.30 గంటలకు చేరుకున్నానని’ తెలిపారు. అయితే, సీఎం పెమాఖండూ ఇలాంటి సాహస విన్యాసాలు లు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుసార్లు బైక్‌ రైడ్‌ చేస్తూ కనిపించారు. గతేడాది నటుడు సల్మాన్‌ఖాన్‌తో పాటు సైకిల్‌ తొక్కిన విషయం తెలిసిందే. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియాను చక్కగా వినియోగించుకుంటారు. రాజధాని ఇటానగర్‌కు 250 కిలోమీటర్ల దూరంలో ఈ పాసిఘాట్ ఉంది. దీని పక్క నుంచే బ్రహ్మపుత్రా ప్రధాన ఉపనది సియాంగ్ ప్రవహిస్తోంది.


By October 16, 2019 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/arunachal-pradesh-chief-minister-pema-khandu-rides-royal-enfield-to-promote-tourism/articleshow/71607755.cms

No comments