Breaking News

అమలాపురంలో మెడికో కిడ్నాప్‌ కలకలం.. తనకు దక్కలేదన్న అక్కసుతో


అమలాపురంలోని కిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని కిడ్నాప్‌ యత్నం గురువారం జిల్లాలో కలకలం రేపింది. ఆ యువతికి పెళ్లి కుదిరిందన్న ఆక్రోశంతో మాజీ ప్రేమికుడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఓ యువతి అమలాపురంలోని కిమ్స్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన అవినాష్‌తో గతంలో ఆమె ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే వీరిద్దరి పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో వారి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఆ యువతికి పెళ్లి నిశ్చయం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అవినాష్ ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలన్న దుర్బుద్ధితో కిడ్నాప్ పథకం రచించాడు. ఈ నెల 19న అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలోని తన ఫ్రెండ్ తేజను కలిసిన అవినాష్ అతడితో కలిసి కిమ్స్‌కు వెళ్లాడు. పెళ్లి కుదిరిందంట కదా.. మళ్లీ కలుస్తామో లేదో.. చివరిసారిగా కాఫీ తాగుదామా అంటూ విద్యార్థినితో ముచ్చటించి కారులో ముక్తేశ్వరం తీసుకెళ్లి... అక్కడ బైక్ ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి యానాం వైపు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో అవినాష్‌ అసభ్యంగా మాట్లాడటంతో విద్యార్థిని అప్రమత్తమైంది. ఐ.పోలవరం రాగానే బైక్ మీద నుంచి దూకేసి పోలీస్‌స్టేసన్‌లోకి పరుగులు తీసింది. తనను అవినాష్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడంటూ ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు దొరికితే తనకు చిక్కులు తప్పవని అనుకున్న అవినాష్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. మూడు రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పోలీసులు అతడి కోసం విశాఖపట్టణం, హైదరాబాద్, బెంగుళూరు, మైసూర్‌ తదితర ప్రాంతంలో గాలిస్తున్నారు. అవినాష్‌ కుటుంబంతో పాటు అతడి స్నేహితుడు తేజపై పోలీసులు కేసు నమోదుచేశారు.


By August 23, 2019 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/amalapuram-mbbs-student-foils-kidnap-attempt-jumps-off-bike/articleshow/70798966.cms

No comments