Breaking News

నేడు తిరుమలకు రాష్ట్రపతి కోవింద్.. రెండు రోజులు బస


తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపించే అత్తివరదర్‌ దర్శనానికి రాష్ట్రపతి శుక్రవారం కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాంచీపురం చేరుకున్నారు. అత్తివరదర్‌ దర్శనం తర్వాత శనివారం సాయంత్రం తిరుపతికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే కోవింద్‌కు అక్కడ గవర్నర్, సీఎం జగన్ స్వాగతం పలుకుతారు. అనంతరం కోవింద్ తిరుమలకు చేరుకుంటారు. కొండపైన పద్మావతి గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకుని, తిరుచానూరులో కొత్తగా నిర్మించిన పద్మావతి నిలయం విశ్రాంతి గృహ సముదాయం ప్రారంభానికి హాజరవుతారు. అక్కడ నుంచి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో జులై 15 తెల్లవారుజామున నిర్వహించే చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించేందుకు వెళతారు. చంద్రయాన్‌ ప్రయోగం అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు. కాగా, రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. మరోవైపు, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆయా విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ప్ర‌త్యేకాధికారి ఏవీ ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన శుక్ర‌వారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. టీటీడీ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని రాష్ట్ర‌ప‌తి తిరుమలకు చేరుకుని తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. భద్రతకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, ఇంజినీరింగ్‌, అన్నప్రసాదం, ఎఫ్‌ఎంఎస్‌, ఆరోగ్య విభాగం, ప్ర‌జాసంబంధాలు, వైద్యం, క‌ల్యాణ‌క‌ట్ట‌ తదితర విభాగాల వారీగా సమీక్షించి ఏర్పాట్లపై ధర్మారెడ్డి చర్చించారు.


By July 13, 2019 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/president-ram-nath-kovind-today-evening-will-arriving-to-tirupati/articleshow/70200790.cms

No comments