Breaking News

ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. ఒప్పుకోలేదని


పెళ్లయిన మహిళను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు ఆమె ఒప్పుకోలేదని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికే వెళ్లి కత్తితో పొడిచి పరారయ్యాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫిలింనగర్‌ ప్రాంతం వినాయకనగర్‌లో నివసించే మహిళ(26)కు వివాహమై భర్త, పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమెకు గతంలో టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఆసిఫ్(24) అనే యువకుడితో పరిచయం ఉంది. ఇద్దరూ అప్పడప్పుడూ ఫోన్లో మాట్లాడుకునేవారు. అయితే వివాహితపై మోజు పెంచుకున్న ఆసిఫ్ తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం భర్తకు తెలిస్తే తనను వదిలేస్తాడని భయపడిన ఆమె ఎవరికీ చెప్పకుండా వేధింపులను మౌనంగా భరించింది వేధింపులు మరింత ఎక్కువ కావడంతో నెల రోజుల క్రితం తన బావకు విషయం చెప్పింది. దీంతో ఆయన ఆసిఫ్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అయినప్పటికీ ఆసిఫ్ ఆమెన వేధించడం ఆపలేదు. తనను పెళ్లి చేసుకోవడం కుదరకపోతే కనీసం లైంగిక కోరికైనా తీర్చాలని వేధిస్తున్నాడు. అతడు ఎంతగా ఒత్తిడి తెచ్చినా బాధితురాలు తిరస్కరిస్తూనే వస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న ఆసిఫ్ సోమవారం భర్త లేని సమయంలో వివాహిత ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు వెంటనే అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. స్థానికులు బాధితురాలిని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితురాలి భర్త ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు ఆసిఫ్‌ను అరెస్ట్ చేశారు. బాధితురాలితో అతడు మాట్లాడిన కాల్స్‌ డేటాను సేకరిస్తున్నారు. ఆసిఫ్‌పై హత్యాయత్నం, వేధింపుల సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


By June 26, 2019 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/love-harassment-married-woman-attacked-by-man-in-hyderabad/articleshow/69951551.cms

No comments