ప్రజావేదిక కూల్చివేత: అత్యవసర పిటిషన్.. స్టేకు హైకోర్టు నిరాకరణ!
నిబంధనలకు విరుద్దంగా గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా మంగళవారం సాయంత్రం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారు. అయితే, ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైంది. ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పి.శ్రీనివాసరావు ప్రజాప్రయోజ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తీర్పు వెలువరించిన , కూల్చివేత నిలుపుదలకు నిరాకరించింది. అడ్వొకేట్ జనరల్ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. నిలుపుదలకు నిరాకరించి, కేసు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ప్రజావేదిక కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని దాఖలైన పిల్పై మంగళవారం అర్థరాత్రి 2.30 దాటిన తర్వాత కూడా ధర్మాసనం ఎదుట విచారణ కొనసాగింది. జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ శ్యాంప్రసాద్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి తమ వాదనలు వినిపించారు. ప్రజావేదిక కూల్చడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అవుతుందని పిటిషన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అంతేకాదు, అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నాకే ముందుకెళ్లాలని, ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చించాలని ఆయన కోరారు. ఏకపక్షంగా ప్రజావేదిక కూల్చివేతకు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఉండాలని, కానీ ప్రజావేదిక విషయంలో అలాంటివి పాటించకుండా కూల్చుతున్నారన్నారు. అలాగే, రూ.8.9కోట్ల ప్రజాధనంతో ప్రభుత్వంలోని ఓశాఖ నిర్మించిన ప్రజావేదికను మరో శాఖ అక్రమమని భావిస్తే వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషన్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని హైకోర్టు రిజిష్ట్రీని పిటిషనర్ తరఫు లాయర్ కోరగా ఆ అభ్యర్థనను ఆయన ఏసీజే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏసీజేపై ఇరువురు న్యాయమూర్తులు ముందు విచారణకు వచ్చేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు, ప్రజావేదిక కూల్చివేత పనులు శరవేగంగా సాగుతున్నాయి. భారీ భద్రత ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, విదేశీ పర్యటన ముగించుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మంగళవారం అర్ధరాత్రి విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబు నివాసం పక్కనే ప్రజావేదిక ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఈ నేపథ్యంలో పోలీసులను భారీ మోహరించారు. చంద్రబాబు వెంట వచ్చిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రానికి కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశముంది.
By June 26, 2019 at 08:08AM
No comments