Breaking News

Ukraine War ఉక్రెయిన్ లొంగిపోయే వరకూ యుద్ధం ఆగదు.. తేల్చిచెప్పిన పుతిన్


ఉక్రెయిన్‌పై పది రోజులుగా బాంబులు, క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. అటు, రష్యా దాడులను ఉక్రెయిన్ కూడా దీటుగా ఎదుర్కొంటోంది. ఈ దాడుల్లో వేలాది మంది సైనికులతో సహా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఓవైపు చర్చలు కొనసాగుతున్నా రష్యా దాడుల పరంపర మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ ఆయుధాలు వీడే వరకూ తమ దాడులు కొనసాగుతాయని వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ కాల్పుల విరమణ పాటించాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోవాన్‌ చేసిన విజ్ఞప్తికి పుతిన్ ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్ తన పోరాటాన్ని నిలిపివేసే వరకూ రష్యా సైన్యం వెనక్కితగ్గే ప్రసక్తే లేదని వ్లాదిమిర్‌ పుతిన్‌ తేల్చిచెప్పారు. అటు, ఉక్రెయిన్‌ తాజా పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయెల్‌ మేక్రాన్‌ మరోసారి చర్చలు జరిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్‌తో మేక్రాన్‌ చర్చలు జరపడం ఇది నాలుగోసారి. అయినాసరే, రష్యా అధ్యక్షుడు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసినా ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్‌ నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ‘హ్యుమానిటేరియన్‌ కారిడార్‌’కు రెండోరోజూ ఆటంకం ఏర్పడింది. మరియూపొల్‌, వోల్నవాఖా నగరాల్లో కాల్పుల విరామం ఉంటుందని ప్రకటించిన రష్యా.. మళ్లీ దాడులకు తెగబడుతోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది. దీంతో తరలింపు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు మరియూపొల్‌ అధికారులు పేర్కొన్నారు. శనివారం రోజు కూడా కొద్దిసేపు విరామం ప్రకటించినప్పటికీ రష్యా సేనలు మళ్లీ దాడులు కొనసాగించడంతో తరలింపు ప్రక్రియ నిలిచిపోయింది. ఆ నగరంలోని విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మైకోలేవ్ నగరం బయట రష్యా సేనలతో భీకర పోరు కొనసాగుతున్నట్టు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. మధ్య ఉక్రెయిన్‌లోని విన్నెట్సియా విమానాశ్రయం వద్ద బ్యారేజ్‌ను రష్యా సైన్యం క్షిపణులతో ధ్వంసం చేసినట్టు అధ్యక్షుడు వొలిడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. ఇర్పిన్‌ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు పౌరులు మోర్టారు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, విదేశీయుల సురక్షిత తరలింపు సహా అన్ని అంశాలపై మూడో విడత చర్చలకు తాము సిద్ధమని రష్యా విదేశాంగ పేర్కొంది. దీంతో సోమవారం మూడో విడత చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ 1.5 మిలియన్ల మంది ప్రాణభయంతో ఉక్రెయిన్ వీడారు.


By March 07, 2022 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/russian-president-vladmir-putin-calls-on-ukraine-to-surrender/articleshow/90043214.cms

No comments