Breaking News

నేడే ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలమో?


వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్‌లో సోమవారం చివరి దశ పోలింగ్ జరుగుతోంది. యూపీలో చివరి దశ పోలింగ్ ముగియనుండగా.. ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం విధించిన నిషేధం కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పలు సంస్థలు వెలువరించనున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడుతుండగా.. ముందుగా వచ్చే ఎగ్జిట్ పోల్స్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం దక్కుతుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు నిలబెట్టుకుంటారా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది పలు సంస్థలు, మీడియా వెల్లడించనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు ముందు ఒపీనియన్ పోల్స్‌ను నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్‌ను ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సేకరించే సమాచారం. దీని ఆధారంగా తుది ఫలితాలను అంచనా వేస్తారు. ఎగ్జిట్ పోల్స్‌ ప్రక్రియలో పలు సంస్థలు పారదర్శక నమూనా పద్ధతిని అనుసరిస్తాయి. వయసు, జెండర్, కులం, మతం, ప్రాంతాలకు అనుగుణంగా సర్వే నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో తప్పా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు నిజమయ్యాయి. గతేడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా ఫలితాలున్నాయి. కానీ, బెంగాల్ విషయంలో మాత్రం కొన్ని సంస్థల అంచనాలు తల్లకిందులయ్యాయి. అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయని అంచనా వేశాయి. కానీ, ఫలితాల్లో మాత్రం తృణమూల్‌‌కు ఏకపక్ష విజయం దక్కింది. మొత్తం 292 స్థానాలకు గానూ టీఎంసీ 214 చోట్ల గెలుపొందింది. బీజేపీ 77 సీట్లకే పరిమితమయ్యింది. ఇక, ప్రస్తుతం ఎన్నికలు జరిగిన యూపీలో మొత్తం 403 సీట్లు ఉండగా.. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాలు 202. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు వరకూ యూపీలో బీజేపీ గెలుపు తథ్యమని అందరూ భావించారు. అయితే, షెడ్యూల్ విడుదల తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. బీజేపీ, ఎస్పీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. అటు, పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళీదల్-బీఎస్పీ కూటమి ప్రధానంగా పోటీ పడ్డాయి. మాజీ సీఎం అమరీందర్‌కు చెందిన జనలోక్ కాంగ్రెస్‌తో బీజేపీ జట్టుకట్టి పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఇక, ఉత్తరాఖండ్‌లోని 70 సీట్లుకు ఫిబ్రవరి 14న పోలింగ్ ముగిసింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలే హోరాహోరీగా తలపడ్డాయి. ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి జరిగే సంప్రదాయం కొనసాగుతుందా? లేదా? అనేది మార్చి 10న తెలిపోనుంది. మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ కూడా అధికార బీజేపీ కూటమితో కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌, టీఎంసీలు పోటీపడ్డాయి.


By March 07, 2022 at 08:49AM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/uttar-pradesh/news/up-and-punjab-goa-uttarakhand-and-manipur-exit-polls-will-be-declared-from-6-pm-on-monday/articleshow/90042251.cms

No comments