Breaking News

పైలట్‌ చాకచక్యం.. త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మమతా బెనర్జీ


విమాన ప్రమాదం నుంచి తాను తృటిలో తప్పించుకున్నట్లు బెంగాల్‌ సీఎం వెల్లడించారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల తన ఎయిర్‌క్రాఫ్ట్‌ను మరో విమానం ఢీకొట్టే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు దీదీ వివరించారు. 8 వేల అడుగుల ఎత్తులో తాను ప్రయాణిస్తున్న విమానం ఉండగా.. అకస్మాత్తుగా మరో విమానం ఇటుగా దూసుకొచ్చిందని మమత పేర్కొన్నారు. పైలట్‌ చాకచక్యం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో తనకు స్వల్ప గాయాలైనట్టు మమత తెలిపారు. విమానం గురించి ఏటీసీ, డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం లేదన్నారు. ‘‘అకస్మాత్తుగా నా విమానం ముందుకి మరో విమానం వచ్చింది.. పరిస్థితి మరో 10 సెకన్లు అలాగే కొనసాగి ఉంటే ఎదురుగా వచ్చిన విమానం ఢీకొనే ప్రమాదం ఉండేది.. పైలట్ సమర్థత వల్ల నేను బతికిపోయాను.. నా వీపు, ఛాతీపై గాయాలయ్యాయి. నాకు ఇంకా నొప్పి ఉంది’’ అని బెంగాల్ సీఎం తెలియజేశారు. ఘటన తర్వాత సురక్షితంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయంలో విమానాన్ని దింపాడు. కాగా, ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి బెంగాల్ ప్రభుత్వం నివేదిక కోరింది. మమతా బెనర్జీ చార్టర్డ్ ఫ్లైట్‌లో ప్రయాణించే మార్గానికి ఆమోదం లభించిందో? లేదో? కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలని భావిస్తోందని పేరకొంది. ఉత్తర్ ప్రదేశ్‌‌లో అఖిలేశ్ యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్లి.. దీదీ తిరిగొస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 10.3 టన్నులు బరువుండే తేలికపాటి విమానం డస్సాల్ట్ ఫాల్కన్ 2000లో దీదీ ప్రయాణించారు. అందులో ఇద్దరు పైలట్ల సహా 19 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది.


By March 08, 2022 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pilot-averted-head-on-collision-with-another-plane-says-mamata-banerjee/articleshow/90065691.cms

No comments