Breaking News

కుటుంబంతో ఉక్రెయిన్‌లో చనిపోయిన భారతీయ విద్యార్థి చివరి మాటలు వైరల్


ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడిలో భారత విద్యార్థి నవీన్ శేఖరగౌడ మృతితో అక్కడ చిక్కుకున్నవారి భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన నవీన్‌ శేఖరగౌడ (21) ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. నవీన్ మరణంపై దేశవ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది. కాగా, కుటుంబసభ్యులతో నవీన్‌ చివరిసారిగా మంగళవారం ఉదయం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తమతో మాట్లాడినట్లు తండ్రి, తాతయ్యతో నవీన్‌ వీడియో కాల్‌లో తెలిపాడు. భారతీయులు క్షేమంగా ఉండేలా.. ఇరు దేశాల అధికారులతో కేంద్రం మాట్లాడిందని మంత్రి చెప్పినట్లు పేర్కొన్నాడు ‘‘ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడాం... మమ్మల్ని తరలించడంలో కాస్త సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు.. రష్యా, ఉక్రెయిన్‌ ప్రభుత్వాలతో భారత్ మాట్లాడిందని.. భారతీయులకు ఎలాంటి హాని జరగకుండా చూస్తామని ఇరు దేశాలు హామీ ఇచ్చాయని ఆయన చెప్పారు’’ అని నవీన్‌ వివరించాడు. ఈ సమయంలో నవీన్‌కు తండ్రి పలు సూచనలు చేశారు. ‘‘ మీ దగ్గర పెద్ద సైజు భారతీయ జెండా ఉంటే దాన్ని మీరు ఉండే బిల్డింగ్‌ బయట ఉంచండి.. మంత్రి మాకు ఇదే విషయాన్ని వెల్లడించారు’’ అని కుమారుడితో చెప్పారు. ఖార్కివ్‌లోని గవర్నర్‌ బంగ్లా పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో నవీన్‌ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఖార్కివ్‌లో భీకర దాడులు కొనసాగుతుండటంతో సమీపంలోని బంకర్‌లోకి వెళ్లారు. అయితే బంకర్‌లో నుంచి ఎందుకు రాలేకపోయావు? అనే తండ్రి అడిగితే.. 2 శాతం మంది మాత్రమే బంకర్‌ను వదిలి వెళ్లే అవకాశం ఉందని, రద్దీ ఎక్కువగా ఉందని సమాధానం ఇచ్చాడు. ‘‘రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు.. రోజుకు మూడు సార్లు ఉదయం 6, 10, మధ్యాహ్నం ఒంటి గంటకు రైళ్లు ఉన్నాయి’ అని నవీన్‌ చెప్పడంతో ‘‘ పరిస్థితులను బట్టి ఎలాంటి నిర్ణయమైనా తీసుకో.. అక్కడి నుంచి 40-50 కి.మీ. ముందుకు వెళితే క్షేమంగా బయట పడేందుకు మరిన్ని మార్గాలు ఉంటాయి’’ అని తండ్రి సూచించారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన కొన్ని గంటలకే రష్యా బాంబుల దాడిలో నవీన్‌ మృతిచెందాడు. బంకర్‌లో ఆహారం, నీళ్లు లేకపోవడంతో కరెన్సీ మార్చుకుని ఆహారం తెచ్చుకునేందుకు నవీన్‌ బయటకు వచ్చాడు. గవర్నర్‌ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న ఓ సూపర్ మార్కెట్‌కు వెళ్లి అక్కడ క్యూలైన్‌లో నిలబడి ఉన్న సమయంలో రష్యా బలగాలు షెల్‌ ప్రయోగించాయి. అయితే అది వారు టార్గెట్ చేసిన గవర్నర్ కార్యాలయం కాకుండా గ్రాసరీ స్టోర్‌ సమీపంలో పడింది. దీంతో నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వాస్తవానికి ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకకు చేరుకున్న బృందంతో కలిసి నవీన్‌ రావాల్సి ఉంది. అయితే, చాలా మంది జూనియర్లు ఉన్నారని, వారితో కలిసి అందరం ఒకేసారి వెళ్దామని చెప్పిన నవీన్‌.. ఇలా ఒంటరిగా వెళ్లిపోయాడని శ్రీధర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.


By March 02, 2022 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/last-video-of-indian-student-naveen-who-killed-in-ukraine-talking-to-his-family-goes-viral/articleshow/89935935.cms

No comments