Breaking News

నేడే హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ.. అమల్లోకి ఆంక్షలు


కర్ణాటకను కుదిపేసిన హిజాబ్ వివాదంపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించనుంది. దాదాపు మూడు నెలలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై సుదీర్ఘరణల అనంతరం తీర్పును రిజర్వ్‌లో ఉంచిన హైకోర్టు.. తాజాగా ప్రకటించనుంది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. హిజాబ్‌ను అనుమతిస్తుందా? లేదా? అనేది తేలిపోనుంది. విద్యా సంస్థల్లోకి హిజాబ్‌‌కు అనుమతి ఇవ్వాలంటూ ఉడుపి, కుందాపుర ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌లపై ఫిబ్రవరి 10 నుంచి రెండు వారాల పాటు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలోని హైకోర్టు విస్తృత ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్‌ కామత్, ప్రభుత్వం పక్షాన ప్రభులింగ్‌ నావడగి వాదనలు వినిపించారు. ఇదే అంశంపై మధ్యంతర పిటిషన్ల దాఖలు కాగా.. విచారణ చేపట్టిన ధర్మాసనం ఫిబ్రవరి 25 నుంచి తీర్పు రిజర్వ్‌లో ఉంచింది. మంగళవారం ఉదయం తుది తీర్పు వెల్లడించనుంది. రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఆందోళనలు, నిరసనలు కొనసాగించారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ వస్త్రధారణను నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తొలుత విచారణ చేపట్టిన జస్టిస్‌ కృష్ణ దీక్షిత్‌ ఏకసభ్య ధర్మాసనం.. కేసును తిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. పాఠశాలల అభివృద్ధి సమితి(ఎస్‌డీసీ)లు రూపొందించిన యూనిఫామ్‌లనే ధరించాలని ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి మతపరమైన వస్త్రాలు ధరించి రావద్దని సూచించింది. హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పును వెలువరించనుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన బొమ్మై సర్కారు.. రాజధాని బెంగళూరు, మంగళూరు నగరాల్లో వారం రోజుల పాటు 144వ సెక్షన్‌ విధించింది. కర్ణాటక వ్యాప్తంగా మార్చి 15 నుంచి 21 వరకు మద్య నిషేధం ప్రకటించింది. వివాదం మొదలైన ఉడుపిలో విద్యా సంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. హిజాబ్ వివాదం రేగిన ద‌క్షిణ క‌న్న‌డ జిల్లావ్యాప్తంగా మంగ‌ళ‌వారం అన్ని విద్యాల‌యాల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తూ క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మంగ‌ళ‌వారం జ‌రిగే ప‌రీక్ష‌ల‌ను కూడా వాయిదా వేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ అన్ని విద్యాల‌యాల‌ను ఆదేశించారు. మార్చి 15 నుంచి 21 వ‌ర‌కు బెంగ‌ళూరు న‌గ‌రంలో నిషేధాజ్ఞ‌ల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు నగర కమిషనర్ కమలా పంత్ ప్ర‌క‌టించారు. నిరసనలు, ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.


By March 15, 2022 at 08:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-high-court-today-declare-verdict-on-hijab-issue/articleshow/90213588.cms

No comments