Breaking News

నెహ్రూ భారతంలో సగం ఎంపీలు నేర చరితులే.. సింగ్‌పూర్ ప్రధాని వీడియో వైరల్!


భారత్‌లోని ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై లీసెన్ లూంగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పార్లమెంట్ వేదికగా ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా ఎంపీ పార్లమెంట్‌లో చెప్పిన అబద్దాలపై సభా హక్కుల కమిటీ ఇచ్చిన నివేదికను ఉద్దేశించి ఫిబ్రవరి 15న సింగ్‌పూర్ పార్లమెంట్‌లో లీసెన్ లూంగ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఎలా పనిచేయాలో భారత తొలి ప్రధాని చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘‘మీడియా నివేదికల ప్రకారం నెహ్రూ భారతంలో ఇప్పుడు దాదాపు సగం మంది లోక్‌సభ ఎంపీలపై అత్యాచారం, హత్య సహా పలు నేరపూరిత అభియోగాలు పెండింగ్‌ లో ఉన్నాయి.. ఈ ఆరోపణల్లో చాలా వరకూ రాజకీయ ప్రేరేపితమైనవి ’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా దేశాలు ఉన్న త ఆదర్శాలతో, గొప్ప విలువలతో స్థాపితమవుతాయి. కానీ, దశాబ్దాలు, తరాలు గడిచేకొద్దీ పరిస్థితులు మారిపోతాయి. స్వాతంత్య్రం కోసం పోరాడి, విజయం సాధించిన నేతలు గొప్ప ధైర్యాన్ని, ఉత్కృష్టమైన సంస్కృతిని, అసాధారణమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. నిప్పుల కొలిమిలోంచి వచ్చిన ఆ నాయకులంతా దేశాధినేతలుగా, నాయకులుగా ఎదుగుతారు. వాళ్లే డేవిడ్‌ బెన్‌-గరియన్లు, జవహర్‌లాల్‌ నెహ్రూ.. మనం కూడా అలాంటి నేతలను కలిగి ఉన్నాం.. ప్రజాకాంక్షలను నెరవేర్చడానికి వారంతా ఎంతగానో కష్టపడతారు.. తమ దేశ, ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. కానీ, తొలినాళ్లలో ఉండే ఆ ఉత్సాహాన్ని, వేగాన్ని కొనసాగించడాన్ని తదుపరి తరాలు కష్టంగా భావిస్తాయి.. రాజకీయాల తీరు మారుతుంది.. నాయకుల పట్ల గౌరవం తగ్గుతుంది.. కొన్నాళ్ల తర్వాత ప్రజలు దీన్ని సాధారణంగా భావించే స్థితికి వస్తారు.. ప్రమాణాలు దిగజారి, విశ్వాసం సన్నగిల్లుతుంది.. దేశం మరింతగా పతనమవుతుంది. ఈ రోజు చాలా రాజకీయవ్యవస్థలు.. ఆయా జాతి నిర్మాతలు సైతం గుర్తించలేనంతగా మారిపోయాయి. ఉదాహరణకు బెన్‌-గురియన్‌ ఇజ్రాయెల్‌.. రెండేళ్లలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంది..ఇక నెహ్రూ భారతంలో.. లోక్‌సభలో దాదాపు సగం మంది ఎంపీలపై హత్య, అత్యాచారం సహా పలు నేరపూరిత అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయని మీడియాలో వచ్చింది. వాటిలో చాలావరకూ రాజకీయ ప్రేరేపితమైనవే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. సింగపూర్‌ ప్రధాని అనుచిత వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని పేర్కొంటూ భారత్‌లోని సింగపూర్‌ రాయబారికి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ‘‘పండిట్‌ నెహ్రూ గొప్పదనం నేటికీ ప్రపంచ నేతలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.. ఇక్కడ మాత్రం ఆ అసామాన్య నేతను అర్థం చేసుకునే దృష్టి లోపించింది’’ అని ట్విటర్‌ ద్వారా కాంగ్రెస్‌ విమర్శించింది.


By February 18, 2022 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/centre-objects-to-singapore-pm-lee-hsien-loong-comments-on-tainted-indian-mps/articleshow/89654109.cms

No comments