Breaking News

కర్ణాటకలో హైడ్రామా.. అసెంబ్లీలోనే నిద్రపోయిన కాంగ్రెస్ సభ్యులు


త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండాను తీసుకొస్తామని కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది. ఈ వ్యవహారం గురువారం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా రెండో రోజు గురువారం కాంగ్రెస్‌ ఆందోళన కొనసాగింది. మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి, మంత్రి పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేస్తూ ఒక రోజు గడువు ఇచ్చింది. జాతీయ జెండాను అవమానించినందుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు గురువారం రాత్రి అసెంబ్లీలోనే బస చేశారు. ఈశ్వరప్పపై దేశద్రేహం కేసు నమోదు చేయాలని, మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ విధానసభలోనే గురువారం రాత్రి నిద్రపోయారు. మరోవైపు, కాంగ్రెస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు చివరి ప్రయత్నంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరీలు భేటీ అయ్యారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రకటించినా, అసలు సమస్యే కాని అంశంపై ముగింపు ఎక్కడిదని సీఎం సమాధానమిచ్చారు. అంతేకాదు, ఆందోళన వెనుక బలమైన కారణం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో చర్చలు ఫలించలేదు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ.. ‘‘ప్రతిపక్ష పార్టీ నేతలకు దాదాపు రెండు గంటలపాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశాం.. అసెంబ్లీలో నిద్రపోవద్దని సూచించాం.. కానీ వాళ్లు ముందే నిర్ణయించుకున్నారు.. స్పీకర్ కూడా వారికి నచ్చజెప్పారు.. మేం శతవిధాలా ప్రయత్నించాం కానీ వాళ్లు అంగీకరించలేదు.. రేపు కూడా వాళ్లతో మాట్లాడుతాం’’ అని అన్నారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యులకు అధికారులు సరైన భోజన సౌకర్యం, వసతి కల్పించారు. మొత్తం 15 రకాల వంటకాలతో కూడిన భోజనం, పరుపులు, దిండ్లు ఏర్పాటు చేశారు. దోమలు కుట్టకుండా ప్రత్యేక పరదాలు సైతం సిద్ధం చేశారు. విధానసభ, పరిషత్తు కాంగ్రెస్‌ సభ్యులు 120మంది రాత్రి ఆందోళనలో పాల్గొన్నారు. అంతకు ముందు సమావేశాల్లో వరుసగా రెండో రోజు గురువారం కాంగ్రెస్‌ ఆందోళన కొనసాగింది. మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పపై కేసు నమోదు చేసి, మంత్రి పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేస్తూ ఒక రోజు గడువు ఇచ్చింది. గురువారం సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. ఓ వైపు ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నా, వారు ఈశ్వరప్పపై నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించేందుకు విపక్ష నేత సిద్ధరామయ్యను స్పీకర్‌ ఆహ్వానించినా అందుకు కాంగ్రెస్‌ సభ్యులు సహకరించలేదు. సభ ప్రారంభమైన గంటన్నరలోనే వాయిదా పడింది. భోజన విరామం తర్వాత కూడా కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళన కొనసాగించారు. చర్చలకు అవకాశం లేకపోవటంతో సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డె కాగేరి ప్రకటించారు.


By February 18, 2022 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-mlas-and-mlcs-sleepover-in-karnataka-assembly-due-to-minister-comments-on-national-flag/articleshow/89653548.cms

No comments