Breaking News

పద్మభూషణ్‌ను తిరస్కరించిన కమ్యూనిస్ట్ నేత బుద్ధదేవ్ భట్టాచార్య!


పలు రంగాల్లో విశిష్ట సేవలందించే వ్యక్తులకు ఏటా ఇచ్చే పద్మ పురస్కారాలను మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ ప్రకటించింది. వీరిలో పశ్చిమ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ నేత బుద్ధదేవ్ భట్టాచార్యను పద్మభూషణ్‌కు ఎంపిక చేసింది. అయితే, ఈ అవార్డును తాను తిరస్కరిస్తానని బుద్ధదేవ్ తెలిపారు. పద్మ అవార్డుల్లో తన పేరున్న సంగతి తెలియదని, ఒకవేళ ఉంటే తీసుకోబోనని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ అత్యున్నత పౌర పురస్కరానికి ఎంపికైన వ్యక్తులు అవార్డులను తిరస్కరించడం చాలా అరుదుగా జరుగుతుంది. ‘‘పద్మభూషణ్ అవార్డు గురించి నాకేమీ తెలియదు.. దాని గురించి ఎవరూ నాకు ఏమీ చెప్పలేదు.. ఒకవేళ నిజంగా వారు నాకు పద్మభూషణ్ అవార్డు ఇస్తే నేను దానిని తిరస్కరిస్తున్నాను’’ అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బుద్ధదేవ్‌తో పాటు పార్టీ నిర్ణయం కూడా ఇదేనని సీపీఎం వర్గాల సమాచారం. అయితే, కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం.. పద్మ అవార్డు విషయమై మాజీ సీఎం భార్యతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం మాట్లాడారు. అవార్డును అంగీకరించిన ఆమె.. ఎంపిక చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారని హోం శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే వ్యక్తుల్లో ఒకరైన బుద్ధదేవ్ భట్టాచార్య వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొద్దికాలం నుంచి బహిరంగ సమావేశాలు, సభలకు దూరంగా ఉంటున్నారు. కాగా, పద్మ అవార్డులకు ఎంపికైన వ్యక్తులు తిరస్కరించడం చాలా అరుదుగా జరుగుతుంది. గతంలో ప్రముఖ గాయని ఎస్.జానకి, బాలీవుడ్ సినీ రచయిత సలీం ఖాన్‌లకు పద్మశ్రీ అవార్డును ప్రకటించగా వారు తిరస్కరించారు. అలాగే, ప్రముఖ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ తనకు 1974లో ప్రకటించిన అవార్డును 2005లో తిరిగిచ్చారు. రచయిత కుష్యంత్ సింగ్ పద్మ భూషణ్‌ను తిరిగిచ్చేసినా.. 2007లో మళ్లీ పద్మవిభూషణ్‌ను స్వీకరించారు. ఈ ఏడాది పద్మ అవార్డులకు ఎంపికైన ఇద్దరు ప్రతిపక్ష పార్టీల నేతల్లో బుద్ధదేవ్ భట్టాచార్య, కాంగ్రెస్ నేత ఉన్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానం వైఖరిని ప్రశ్నిస్తున్నవారిలో గులాంనబీ ఆజాద్ ఒకరు. భట్టాచార్య అవార్డును తిరస్కరించడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశంసించారు. అలాగే, ఆజాద్‌పై విరుచుకుపడ్డారు. ‘భట్టాచార్య అలా చేయడం సరైంది.. అతను ఆజాద్ (స్వతంత్రుడు) గులాం (బానిస) కాదు’ అని ట్వీట్ చేశారు.


By January 26, 2022 at 07:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/communist-top-leader-buddhadeb-bhattacharjee-rejects-padma-bhushan/articleshow/89128190.cms

No comments