Breaking News

దేశంలో కరోనా కరాళనృత్యం: 8 నెలల తర్వాత 3 లక్షలు దాటిన కొత్త కేసులు


దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. వరుసగా మూడు రోజుల పాటు తగ్గినట్టే తగ్గిన రోజువారీ కేసులు.. మంగళవారం నుంచి మళ్లీ భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకూ 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షలకుపైగా కొత్త కేసులు బయటపడ్డాయి. దేశంలో 8 నెలల తర్వాత రోజువారీ కేసులు 3 లక్షలు దాటడం ఇదే తొలిసారి. చివరిసారిగా సెకెండ్ వేవ్ సమయంలో గతేడాది మే 15న 3,11,077 రోజువారీ కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా, వేరియంట్ వ్యాప్తితో విరుచుకుపడుతోంది. సెకెండ్ వేవ్‌లో రోజువారీ కేసులు 3 లక్షల దాటడానికి 60 రోజులు పడితే.. థర్డ్ వేవ్‌లో మాత్రం కేవలం 23 రోజుల్లోనే ఆ మార్క్ దాటడం గమనార్హం. డిసెంబరు 27న 6,500 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 23 రోజుల్లోనే మూడు లక్షలు దాటేయడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది. గతేడాది ఫిబ్రవరి మధ్యలో సెకెండ్ వేవ్ మొదలై ఏప్రిల్ 21 తర్వాత గరిష్ఠానికి చేరింది. రోజువారీ కేసులు లక్షల్లో నమోదవుతున్నా మరణాలు తక్కువగానే ఉండటం కాస్తా ఊరటనిస్తోంది. కానీ, క్రమంగా కోవిడ్ మరణాలు, ఆస్పత్రిల్లో ఆక్సిజన్‌ పడకలకు డిమాండ్ పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. దేశంలో వరుసగా రెండో రోజూ 400కిపైగా కోవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అమెరికాలో రోజువారీ కేసులు మిలియన్ దాటేయగా.. ప్రస్తుతం కాస్తా తగ్గుముఖం పట్టాయి. ఐరోపాలోని ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌లోనూ లక్షల్లోనే కేసులు నమోదవుతున్నాయి. మరణాల విషయానికొస్తే అమెరికా, రష్యా, కెనడా, మెక్సికో, పోలండ్ వంటి దేశాల కంటే భారత్‌లో ఈ సంఖ్య తక్కువగానే ఉంది. గత 24 గంటల్లో మహారాష్ట్ర, కర్ణాటకలో 40వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో 30వేలకుపైగా కేసులు, తమిళనాడు, గుజరాత్‌లో 20వేలకుపైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇక, ఆరు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు 10,000 దాటాయి. ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం 10వేలకుపైగా కేసులు బయటపడ్డాయి. మరో 12 రాష్ట్రాల్లో 1,000కిపైగా కేసులు నిర్ధారణ అయ్యాయి.


By January 20, 2022 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-daily-covid-cases-tally-crosses-3-lakh-after-8-months/articleshow/89008029.cms

No comments