Breaking News

కనీసం మీరైనా మమ్మల్ని గుర్తించండి: ముస్లిం దేశాలకు తాలిబన్లు అభ్యర్థన


తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత అఫ్గనిస్థాన్‌ ప్రజలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మానవహక్కులను హరిస్తూ కఠిన ఆంక్షలను విధిస్తున్నారు. గతేడాది ఆగస్టులో అఫ్గనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని, మహిళ హక్కులకు భంగం కలిగించబోమన్న తాలిబన్లు హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. దీంతో అంతర్జాతీయ సమాజం అఫ్గన్‌లో పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. తాలిబన్ల ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్‌ నిధులు తాలిబన్లకు అందకుండా అమెరికా సహా పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించేందుకు ప్రపంచ దేశాధినేతలు విముఖత ప్రదర్శించడంతో అఫ్గన్‌‌ మానవతా సంక్షోభంలోకి జారుకుంటోంది. ఈ నేపథ్యంలో కనీసం ముస్లిం దేశాలైనా తమను గుర్తించాలని తాలిబన్లు ప్రాధేయపడుతున్నారు. ముందుకొచ్చి తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని అఫ్గన్‌ ప్రధాని మొహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ జాదా విజ్ఞప్తి చేశారు. అఫ్గన్ ఆర్థిక సంక్షోభంపై నిర్వహించిన ఓ సమావేశంలో అఖుంద్‌ మాట్లాడుతూ ‘‘మా ప్రభుత్వాన్ని ముస్లిం దేశాలైనా అధికారికంగా గుర్తించాలని కోరుతున్నాం.. అప్పుడే, దేశాన్ని త్వరగా అభివృద్ధి చేయగలం.. మా అధికారుల కోసం కాదు.. దేశ ప్రజల కోసమే మేం అభ్యర్థిస్తున్నాం’’అని అఖుంద్‌ అన్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం ద్వారా అవసరమైన అన్ని షరతులను తాలిబన్‌ ప్రభుత్వం నెరవేర్చిందని ఆయన స్పష్టం చేశారు. అఫ్గన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక అక్కడ ఆర్థిక, ఆహార సంక్షోభం ఏర్పడింది. విదేశీ బ్యాంకుల్లోని అఫ్గన్‌ నిధులను స్తంభింపజేయగా.. దేశంలో చాలా మంది ఉపాధి, ఉద్యోగవకాశాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకుంది. ఆహార కొరత తీవ్రమవడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అఫ్గన్ ప్రజలు.. ప్రపంచ దేశాలవైపు దీనంగా చూస్తున్నారు. అంతేకాదు, తమ పిల్లలను కాపాడుకోడానికి అవయవాలను కూడా అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల్లో నిల్వ ఉంచిన అఫ్గన్‌ నిధుల్ని విడుదల చేయాలని, తమ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలని గత కొంతకాలంగా ప్రపంచదేశాలను తాలిబన్లు కోరుతున్నారు. గతంలో తాలిబన్ల పాలనను పాకిస్థాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ మాత్రమే గుర్తించాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశాలు కూడా దూరంపెట్టాయి. మరోపక్క, అఫ్గన్‌లో ఆకలి సునామీ రాబోతోందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి తక్షణమే మానవతా సాయం అందించాలని అఫ్గన్‌లోని డబ్ల్యూఎఫ్‌పీ ప్రతినిధి మేరీ ఎల్లెన్‌ మెక్‌గ్రోర్టీ విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రస్తుతం 2.28 కోట్ల మందికి తీవ్రమైన ఆహార కొరత ఉందని, ఇందులో 87 లక్షల మంది ఆకలిచావులకు చేరువయ్యారని ఆమె వాపోయారు. అఫ్గన్ల ఆకలి తీర్చేందుకు తమకు నిధుల కొరత తీవ్రంగా ఉందని, వచ్చే 12 నెలల పాటు పూర్తిస్థాయిలో మానవతా సాయం కొనసాగించేందుకు కనీసం 4.4 బిలియన్‌ డాలర్లు కావాలన్నారు. ఆహార పంపిణీ కనీస స్థాయిలో చేపట్టాలన్నా 2.6 బిలియన్‌ డాలర్లు అవసరమని చెప్పారు. అఫ్గాన్‌కు గతంలో సాయం చేసిన వారంతా మానవతాదృక్ఫథంతో తిరిగి ప్రారంభించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.


By January 20, 2022 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/afghanistan-acting-pm-mohammad-hassan-akhund-calls-for-muslim-nations-to-recognise-taliban/articleshow/89008502.cms

No comments