Breaking News

రఫేల్‌కు కౌంటర్‌గా చైనా నుంచి అధునాతన యుద్ధ విమానాలు కొన్న పాక్!


భారత్ కొనుగోలు చేసిన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను పోటీగా దాయాది చైనాకు చెందిన మల్టీరోల్ జే-10సీ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఈ రకం విమానాలను మొత్తం 25 కొనుగోలు చేసినట్టు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షైక్ రషీద్ అహ్మద్ బుధవారం వెల్లడించారు. ప్రతికూల వాతావరణంలోనూ సమర్ధంగా పనిచేసే ఈ ప్రత్యేక విమానాలు వచ్చే ఏడాది మార్చి 23న పాక్ జాతీయ దినోత్సవం రోజున వైమానిక దళంలో చేరనున్నాయని ఆయన తెలిపారు. చైనా దగ్గర ఉన్న అత్యంత విశ్వసనీయమైన యుద్ధ విమానాలలో ఒకటైన J-10Cని అందించడం ద్వారా తన సన్నిహిత మిత్రుడికి అండగా నిలిచింది. ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకున్న తన సహచరులను ఎగతాళి చేయడానికి తనను తాను ‘ఉర్దూ-మీడియం విద్యాసంస్థల గ్రాడ్యుయేట్’‌గా తరచూ చెప్పుకునే మంత్రి రషీద్ అహ్మద్.. ఈ విమానం పేరును J-10Cకి బదులుగా JS-10అని తప్పుగా ఉచ్చరించి మీడియా ముందు నవ్వులపాలయ్యారు. ‘వచ్చే ఏడాది మార్చి 23 న జరిగే పాకిస్థాన్ వేడుకలకు మొట్టమొదటిసారి ముఖ్యమైన అతిథులు వస్తున్నారు.. JS-10 (J-10C) యుద్ద విమానాలు వైమానిక దళంలో చేరనున్నాయి.. భారత్ వద్ద ఉన్న రఫేల్‌కు ధీటైన JS-10 (J-10C) చైనా యుద్ధ విమానాలు గగనతలంలో ఎగరనున్నాయి’ అని పాక్ పేర్కొన్నారు. ఇక, గతేడాది నిర్వహించిన పాకిస్థాన్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలలో పాల్గొన్న జే-10సీ యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు చెందిన నిపుణులు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. గతేడాది డిసెంబరు 7 న ప్రారంభమైన ఈ విన్యాసాలు 20 రోజులపాటు సాగాయి. చైనాకు చెందిన జే-10సీ, జే-11బీ యుద్ధ విమానాలు సహా కేజే-500 వంటి ముందస్తు హెచ్చరికల విమానాలు ఇందులో పాల్గొన్నాయి. పాక్ నుంచి జేఎఫ్-17, మిరేజ్-3 వంటి యుద్ధ విమానాలు భాగస్వామ్యమయ్యాయి. పాక్ వద్ద అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఎఫ్-16ఎస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను ధీటుగా ఎదుర్కొవాలంటే ప్రతికూల వాతావరణంలోనూ సమర్ధంగా పనిచేసే ఫైటర్ జెట్ల కోసం పాక్ ఎదురుచూస్తోంది. అందులో భాగంగా చైనా నుంచి జే-10సీ విమానాలను కొనుగోలు చేసింది.


By December 30, 2021 at 03:47PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-new-squadron-of-fighter-jets-from-china-to-counter-indias-rafale/articleshow/88588879.cms

No comments