Breaking News

Pollution ఢిల్లీని ముంచెత్తిన కాలుష్యం.. టపాసులపై నిషేధం ఉన్నా ఆగని జనం


దీపావళి టపాసుల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై తీవ్రంగా పడింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు దారుణంగా దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382గా నమోదుకాగా.. రాత్రి 8 గంటలక మరింత తీవ్రమయ్యింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 314 నుంచి 341 వద్ద ఉండగా, దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంతో నోయిడాలో ఏక్యూఐ526కు పెరిగింది. ఢిల్లీలో పూసారోడ్డు వద్ద 505 కు చేరింది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, గాలివేగం కాలుష్యానికి మరింత ఊతమిచ్చింది. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400కి చేరింది. టపాసుల పేల్చిన తర్వాత గురువారం రాత్రి 9 గంటలకు ఢిల్లీ చుట్టుపక్కల ఫరిదాబాద్ (424), ఘాజియాబాద్ (442), గురుగ్రామ్ (423), నొయిడా (431) గాలిలో నాణ్యత తగ్గి పరిస్థితి తీవ్రమయ్యింది. నగరంలోని అనేక ప్రాంతాలు, దాని శివారు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు గొంతు దురద, కళ్లలో నీరు కారుతున్నట్లు ఫిర్యాదు చేశారు. పొగమంచు ఈ సీజన్‌లో ప్రారంభం కానప్పటికీ తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జనవరి 1, 2022 వరకు దేశ రాజధానిలో టపాసులపై నిషేధం ఉన్నప్పటికీ, దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, ఉత్తర ఢిల్లీలోని బురారీ, పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్, తూర్పు ఢిల్లీలోని షాహదారా ప్రాంతాల్లోని ప్రజలు రాత్రి 7 గంటలకే టపాసులు పేల్చినట్టు నివేదికలు అందాయి. సాయంత్రం సమయంలో టపాసులు పేలుళ్లు వినిపించకపోవడంతో అందరూ నిబంధనలు పాటిస్తున్నారని అనిపించింది. కానీ, రాత్రి ఏడు గంటల నుంచి నిశ్శబ్దాన్ని చీల్చుతూ భారీ శబ్దాలకు ఎక్కువ సమయం పట్టలేదని కైలాష్ హిల్స్ నివాసి చెప్పారు. గుర్గావ్, ఫరీదాబాద్ నుంచి అధిక-తీవ్రత కలిగిన టపాసులు పేల్చినట్టు తెలుస్తోంది. దీపావళి వేళ టపాసుల వినియోగంపై హరియాణా ప్రభుత్వం నిషేధం విధించినా ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోలేదు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రశాంతమైన గాలులు, తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఎత్తులో గాలులు వీయడం, బాణసంచా కాల్చడం, భారీ పేలుడు, స్థానిక వనరుల నుంచి వెలువడి విషపూరిత పదార్థాల కారణంగా గాలి నాణ్యత తీవ్రంగా మారిందని నిపుణులు పేర్కొన్నారు. ఏక్యూఐ 500 దాటిందంటే తీవ్రమైన కాలుష్యం ఏర్పడిందని తేలింది. పంజాబ్, హర్యానాలో పొలాల మంటల నుంచి వెలువడిన పొగ దేశ రాజధాని వైపు వచ్చింది.పటాకుల వ్యతిరేక ప్రచారం చేయడంతోపాటు 13,000 కిలోలకు పైగా అక్రమ పటాకులను స్వాధీనం చేసుకొని, 33 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అధికారులు చెప్పారు.


By November 05, 2021 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/air-quality-in-severe-category-as-cracker-ban-goes-up-in-smoke-on-diwali-in-delhi/articleshow/87531783.cms

No comments