Breaking News

Covid Tablet కరోనాను అంతంచేసే మాత్రకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్.. దీనిని ఎలా తీసుకోవాలంటే..


కరోనా మహమ్మారిపై యావత్తు ప్రపంచం 20 నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తోంది. పలు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారికి చెక్ పెట్టే మాత్ర త్వరలో అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన మెర్క్, రిడ్జ్ బ్యాక్ బయోథెరప్యుటిక్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన టాబ్లెట్‌ వినియోగానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పేరుతో తయారైన ఈ మాత్రను కోవిడ్ పాజిటివ్‌గా వచ్చిన ఐదు రోజుల్లోపు తీసుకోవడం ప్రారంభించాలని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ (ఎమ్‌హెచ్ఆర్ఏ) సూచించింది. దీంతో నోటి ద్వారా తీసుకునే కరోనాకు మాత్ర ద్వారా చికిత్స విధానాన్ని ఆమోదించిన తొలి దేశంగా బ్రిటన్ చరిత్ర సృష్టించింది. ఈ టాబ్లెట్‌పై అమెరికాలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే బ్రిటన్ దూకుడుగా ముందుకెళ్లి అవసరమైన అనుమతులు జారీ చేసింది. మరోవైపు, ఈ నెలలో జరగబోయే సమావేశంలో అమెరికా కూడా మోల్నుపిరావిర్‌పై ఓటింగ్ చేపట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా యాభై లక్షల మందికిపై ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన ఆయుధంగా ఇప్పటి వరకూ భావిస్తున్నారు. ఇక రెమ్‌డెసివర్, డెక్సామెథాజోన్ వంటివి ఔషదాలు అందుబాటులో ఉన్నప్పటికీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, మోల్నుపిరావిర్‌ను మాత్రం రోగులు ఇంటి వద్ద ఉంటూనే తీసుకోవచ్చు. దీని వల్ల వ్యాధి తీవ్రత తగ్గి ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం దాదాపు 50 శాతానికి పైగా తగ్గిపోతుంది. బ్రిటన్‌లో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నోటి ద్వారా తీసుకునే ఈ మాత్రకు ఆమోదం లభించడం అక్కడి ప్రజలకు స్వాంతన కలిగించే విషయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వైరస్ జన్యువుల్లో తప్పులు దొర్లేలా చేస్తూ ఈ మాత్ర వైరస్‌ను నాశనం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ ట్రయల్స్‌లోనూ ఈ ఔషధం సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. బ్రిటన్‌లో మోల్నుపిరావిర్‌ను లగేవ్రియో పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ‘వీలైనంత త్వరగా జాతీయ అధ్యయనం ద్వారా కోవిడ్ రోగులకు మోల్నుపిరావిర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికలను రూపొందించడానికి NHSతో కలిసి ప్రభుత్వం పని చేస్తోంది’ అని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావీద్ అన్నారు. మెర్క్ సంస్థతో 480,000 కోర్సుల మోల్నుపిరావిర్ కోసం గత నెలలోనే బ్రిటన్ ఒప్పందం చేసుకుంది. అయితే, ఈ ఏడాది చివరి నాటికి 10 మిలియన్ కోర్సుల మాత్రలను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామని, 2022లో కనీసం 20 మిలియన్ల ఉత్పత్తికి లక్ష్యంగా పెట్టుకున్నామని మెర్క్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.


By November 05, 2021 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/uk-approves-merck-oral-covid-pill-molnupiravir-its-becomes-first-country/articleshow/87531516.cms

No comments