Breaking News

Kashmir 24 గంటల వ్యవధిలో మరోసారి దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు


జమ్మూ కశ్మీర్‌లో పోలీస్ కానిస్టేబుల్‌ హత్య జరిగిన 24 గంటల్లోనే మరో సాధారణ పౌరుడ్ని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. శ్రీనగర్‌లోని కశ్మీరీ పండిట్ నడుపుతున్న దుకాణంలో పనిచేసే వ్యక్తిని సోమవారం కాల్చి చంపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహ్మద్ ఇబ్రహీమ్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బందీపొరకు చెందిన మహ్మద్ ఇబ్రహీం.. కశ్మీరీ పండిట్ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. లోయలో కశ్మీరీ పండిట్ల ఊచకోత అనంతరం ఈ దుకాణం 29 ఏళ్లు మూసివేయగా.. తిరిగి 2019లోనే పునఃప్రారంభించారు. 1990 జనవరి ప్రారంభం నుంచే లోయలో రాడికల్స్‌ పెరిగి... పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాధారణ ముస్లింలను రెచ్చగొట్టారు. దీంతో కశ్మీరీ పండిట్లను ఊచకోత కోశారు. ఉగ్రవాదుల హెచ్చరికలు, దాడులకు భీతిల్లి, ప్రాణాలు అరచేత పెట్టుకొని ఆ ఏడాది జనవరి 19న రాత్రివేళ వేలాది మంది కశ్మీరీ పండిట్లు తమ ఆస్తులనూ, ఊళ్లనూ వదిలి చెట్టుకో పుట్టగా వలసపోయారు. తాజాగా, మరోసారి అటువంటి భయాన పరిస్థితిని సృష్టించేందుకు ముష్కరులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల రోజులుగా సాధారణ పౌరులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజా ఘటనను మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులను హత్యచేయడమే విష సంస్కృతి మళ్లీ ప్రారంభం కావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మహ్మద్ ఇబ్రహీం ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అల్లాను ప్రార్ధించారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గత నెలలో పలుచోట్ల ఉగ్రవాదులు దాడులకు తెగబడి.. 11 మంది సాధారణ పౌరులను హత్యచేశారు. వీరిలో చాలా మంది వలస కార్మికులు, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారు. పౌర హత్యల తర్వాత కశ్మీర్ లోయ వ్యాప్తంగా 900 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పౌరులపై దాడిచేసి ఉగ్రవాదుల్లో చాలా మందిని ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 11 ఎన్‌కౌంటర్లలో 17 మంది ఉగ్రవాదులు హతమైనట్టు పేర్కొన్నారు.


By November 09, 2021 at 09:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-shot-dead-by-terrorists-in-srinagar-2nd-targeted-attack-in-24-hours-in-kashmir/articleshow/87597243.cms

No comments