Breaking News

COP26 సదస్సులో మోదీ సహా ప్రపంచ నేతలపై విరుచుకుపడ్డ భారతీయ బాలిక


గ్లాస్గో వేదికగా జరిగిన ఐరాస వాతావరణ మార్పులపై సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక స్పూర్తిదాయక ప్రసంగంతో ప్రపంచ దేశాల అధినేతలను ఆకట్టుకుంది. ‘పర్యావరణ ఆస్కార్స్‌’గా పిలిచే ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ ఫైనలిస్టుల్లో తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వినిశా ఉమాశంకర్‌ ఒకరు. వినిశాను బ్రిటన్‌ రాకుమారుడు ప్రిన్స్‌ విలియమ్స్‌.. COP26లో పర్యావరణ హిత టెక్నాలజీ, ఆవిష్కరణలపై ప్రసంగించేందుకు ఆహ్వానించారు. ప్రధాని మోదీ సహా ప్రపంచ దేశాధినేతలు పాల్గొన్న ఈ సదస్సులో వినిశా తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించారు. ‘‘మాటలు ఆపి.. చేతలు మొదలు పెడదామని గౌరవనీయులైన మీ అందరినీ కోరుతున్నా. ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ విజేతలు, ఫైనలిస్టులమైన మేం..మా ఆవిష్కరణలు, పరిష్కారాలు, ప్రాజెక్టులకు మీ మద్దతు అవసరమని కోరుతున్నాం.. శిలాజ ఇంధనాలు, పొగ, కాలుష్యంపై నిర్మించే ఆర్థిక వ్యవస్థలు వద్దు.. మన భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం మీ డబ్బు, సమయం, కృషి మాపై పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం ఉంది.. మాతో చేతులు కలపాలని ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ విజేతలు, ఫైనలిస్టుల తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా... ఇకనైనా పాత విధానాలు, ఆలోచనలు వదిలేస్తారని ఆశిస్తున్నా.. అయితే, మీరు లేకున్నా, మేం నేతృత్వం వహిస్తాం.. మీరు రాకున్నా, మేం చేసుకుంటాం.. ఇప్పటికీ మీరు గతంలోనే ఇరుక్కుపోయినా, మేం భవిష్యత్తును నిర్మించుకుంటాం.. కానీ దయచేసి నా ఆహ్వానాన్ని స్వీకరించండి.. వట్టి హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయని నేతల పట్ల మా తరంలోని చాలామంది ఆగ్రహంతోనూ, విసిగివేసారిపోయారు.. అయినా.. ఆగ్రహం వ్యక్తం చేసేంత సమయం నాకు లేదు. నేను సాధించాలనుకుంటున్నాను. నేను భారత పుత్రికను మాత్రమే కాదు, పుడమి పుత్రికను.. ఇందుకు నేను గర్విస్తున్నా’’ అని వినిశా స్పష్టం చేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లకు వినూత్న పరిష్కారాలు కనుగొనడం కోసం ప్రిన్స్‌ విలియమ్స్‌ ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ను రూపొందించారు. వాతావరణాన్ని పరిరక్షించడంలో వినూత్న ఆవిష్కరణలు చేసిన వారికి ఈ బహుమతులు అందజేస్తున్నారు. వినిశా తమ వీధిలో ఉన్న రజకుల ఇస్త్రీ పెట్టె నుంచి వెలువడే పొగతో వాతావరణం కలుషితమవుతోందని గమనించారు. దీనికి పరిష్కారంగా సౌరశక్తితో పనిచేసే ఇస్త్రీ బండిని ఆమె రూపొందించారు. ఆ ఆవిష్కరణ ఆమెను ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ పోటీల్లో ఫైనలిస్టుగా నిలిచేలా చేసింది. వినిశా ఉమాశంకర్ ప్రసంగం వీడియోను సుప్రియా సాహు అనే ఐఏఎస్ అధికారి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ప్రపంచ దేశాధినేతల పాల్గొన్న కాప్ 26 ఎర్త్‌షాట్‌ప్రైజ్‌ ఫైనలిస్ట్ తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల వినిశా ఉమాశంకర్ నేను భారత పుత్రికనే కాదు పుడమి పుత్రికనంటూ అద్భుతమైన ఆవిష్కరణ.. అద్బుతమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు’ అని ప్రశంసించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ 1960 నాటి ‘మూన్‌షాట్’ ప్రాజెక్ట్‌ను ప్రేరణగా తీసుకుని ఎర్త్‌షాట్ ప్రైజ్‌ను గతేడాది ప్రిన్స్ విలియమ్స్ ప్రారంభించారు. ఇది ఐదు విభాగాలను ముఖ్యంగా కవర్ చేస్తుంది. ప్రకృతిని ఎలా రక్షించాలి.. పునరుద్ధరించాలి; మన గాలిని శుభ్రం చేయడం; మన మహా సముద్రాలను పునరుద్ధరించడం; వ్యర్థ రహిత ప్రపంచాన్ని నిర్మించడం; మన వాతావరణాన్ని సరిచేయడం.


By November 04, 2021 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-girl-vineesha-umashankar-powerful-glasgow-cop26-speech-pm-modi-biden-were-present/articleshow/87522042.cms

No comments