Breaking News

తలపై కోటి రివార్డు.. మావోయిస్ట్ అగ్రనేత, ఆయన భార్య అరెస్ట్


మావోయిస్ట్ అగ్రనేత ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దాస్ పోలీసులకు పట్టుబడ్డాడు. కిషన్ దా, ఆయన భార్య షీలా మరాండీలను ఝార్ఖండ్‌‌లో అరెస్ట్ చేశారు. పలు దాడులు, పోలీసుల హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న కిషన్‌ దా తలపై రూ.కోటి రివార్డు ఉంది. కిషన్, షీలా మరాండీలను అరెస్ట్ చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. సీపీఐ (మావోయిస్ట్) పార్టీ సభ్యుడైన ప్రశాంత్ బోస్.. ఆ పార్టీ కేంద్ర కమిటీలో సీనియర్ నేత. మావోయిస్ట్ పార్టీ తూర్పు ప్రాంత బ్యూరో సెక్రెటరీగా కొనసాగుతున్నారు. ఇన్‌ఫార్మర్లు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఇరువుర్నీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారి పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరిని గురువారం అరెస్ట్ చేశారు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన ప్రశాంత్ బోస్.. మావోయిస్ట్ దళంలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆ అధికారి వివరించారు. మావోయిస్టు నేతల్లో నెంబర్‌2గా ఉన్న కిషన్ దా.. గణపతి తరువాత అత్యంత పలుకుబడి ఉన్న వ్యక్తి. ప్ర‌శాంత్ బోస్ భార్య షీలా మ‌రాండీ కూడా సీనియర్‌ మావోయిస్టు నాయకురాలు. ప్రస్తుతం ఆమె కూడా సీపీఐ (మావోయిస్టు) సభ్యురాలిగా ఉన్నారు. అంతేకాదు, కేంద్ర కమిటీలో సభ్యురాలిగా ఉన్న ఏకైక మహిళా కూడా షీలా కావడం గమనార్హం. మావోయిస్ట్ పార్టీ విధాన పరమైన నిర్ణయాలను కేంద్ర కమిటీయే తీసుకుంటుంది. ఇదిలా ఉండగా 75 ఏళ్ల ప్రశాంత్‌ బోస్‌ కొంత కాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కాగా, కరోనా వైరస్ మావోయిస్ట్ ఉద్యమంపై తీవ్రంగా ప్రభావం చూపింది. చాలా మంది అగ్రనేతలు కరోనాతో చనిపోయారు.


By November 13, 2021 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/top-maoist-leader-prashanth-bose-carrying-1-crore-bounty-arrested-in-jharkhand/articleshow/87678817.cms

No comments