Breaking News

ఎల్లుండి మధ్యప్రదేశ్‌‌కు మోదీ.. 4 గంటల పర్యటన కోసం రూ.23 కోట్లు ఖర్చు!


నవంబరు 15న భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్‌జాతీయ గౌరవ దివాస్‌ పేరుతో మధ్యప్రదేశ్ వేడుకలు నిర్వహిస్తోంది. గిరిజన యోధుల గౌరవార్దం నిర్వహించే ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భోపాల్‌లోని జంబూరీ మైదానంలో జరిగే బహిరంగ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం దేశంలో మొట్టమొదటిసారి ప్రభుత్వ- ప్రయివేట్ భాగస్వామ్యంతో నిర్మించిన హిబాబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. జాతీయస్థాయిలో నవంబరు 15-22 వరకు వారం రోజుల పాటు జన్‌జాతీయ గౌరవ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇక, జన్‌జాతీయ గౌరవ దివాస్ వేడుకల కోసం భోపాల్‌లోని జంబూరీ మైదానం సర్వాంగ సుందరాంగంగా ముస్తాబువుతోంది. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా 2 లక్షల మంది గిరిజనులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ప్రాంగణం మొత్తం గిరిజనుల కళలు, గిరిజన నేతల చిత్రాలతో అలంకరించారు. ప్రధాని పర్యటన సహా వేడుకల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. మొత్తం రూ.23 కోట్లను వెచ్చిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. నాలుగు గంటల పాటు ప్రధాని భోపాల్‌లో గడపడనుండగా.. మైదానంలోని వేదికపై 1.15 గంటలు ఉంటారు. వేదికపై ఐదు డోమ్‌లను ఏర్పాటుచేశారు. గిరిజనుల కోసం భారీ వేదికలను నిర్మించారు. ఇందు కోసం 300 మంది వారం రోజులకుపైగా శ్రమిస్తున్నారు. మొత్తం రూ.23 కోట్లలో రూ.13 కోట్లు ప్రజలను సభకు తీసుకొచ్చేందుకు ఖర్చుచేస్తున్నారు. 52 జిల్లాల నుంచి వచ్చే గిరిజనుల రవాణా, ఆహారం, వసతి కోసం రూ.12 కోట్లకుపైగా ఖర్చవుతున్నట్టు తెలిపారు. ఐదు డోమ్‌లు, టెంట్లు, అలంకరణ, పబ్లిసిటీ కోసం మొత్తం రూ.9 కోట్లు కేటాయించారు. అయితే, గిరిజనులను ప్రసన్నం చేసుకోడానికే బీజేపీ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 47 ఎస్టీ నియోజకవర్గాలకుగానూ 2008లో 29, 2013లో 31 స్థానాలను గెలిచిన బీజేపీ.. 2018 ఎన్నికల్లో కేవలం 16 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఇక, ఇటీవల ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. ఎస్టీలపై దాడులు దేశంలోనే అత్యధికంగా ఇక్కడే నమోదవుతున్నాయి. 2019లో షెడ్యూల్డ్ తెగలపై 2,400కిపైగా దాడులు జరిగాయి. 2017, 2018తో పోల్చితే ఈ సంఖ్య 10 శాతం ఎక్కువ.


By November 13, 2021 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/madhya-pradesh-govt-to-spend-23-crore-for-4-hours-of-pm-modi-visit/articleshow/87678325.cms

No comments