Breaking News

Border వెనక్కు తగ్గని చైనా.. కొత్తగా 8 చోట్ల సైనిక నిర్మాణాలు: నిఘా వర్గాల సంచలన నివేదిక


తూర్పు లడఖ్‌లో భారత్, చైనాల మధ్య గతేడాది మే మొదటి వారం నుంచి సైనిక ప్రతిష్టంభన కొనసాగుతోంది. బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల్లో భారీగా సైనిక నిర్మాణాలను మాత్రం చైనా ఆపడంలేదు. భారత్ ఎదుర్కొంటున్న సైనిక, వైమానిక స్థావరాల అప్‌గ్రేడ్‌లో భాగంగా సరిహద్దుల్లో మరిన్ని సైనిక ఆశ్రయాలను నిర్మిస్తూనే ఉంది. నిఘా, పర్యవేక్షణ వర్గాల తాజా నివేదిక ప్రకారం.. ‘వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో చైనావైపున కనీపసం ఎనిమిది చోట్ల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన సైనికుల కోసం ఆధునిక కంటెయినర్ ఆధారిత షెల్టర్లు నిర్మాణం చేపట్టింది.. ఈ కొత్త నిర్మాణాలు ఉత్తరాన కరాకోరం కనుమ దగ్గర వహబ్ జిల్గా నుంచి ఎల్ఏసీ వెంట దక్షిణవైపు పీయూ, హాట్ స్ప్రింగ్స్, చాంగ్ లా, తాషిగాంగ్, మంజా, చురూప్ వరకు కొనసాగుతున్నాయి.. ప్రతి ప్రదేశంలో 80 నుంచి 84 కంటైనర్లు ఏడు క్లస్టర్లలో ఏర్పాటు చేశారు’ అని సైనిక వర్గాలు తెలిపాయి. గతేడాది ఏప్రిల్-మేలో సైనిక ప్రతిష్టంభన మొదలైనప్పటి నుంచి నిర్మించిన పులు నిర్మాణాలకు ఇవి అదనమని, భవిష్యత్తులో సైన్యాలను వెనుక్కు మళ్లించే ఉద్దేశం చైనాకు లేదని స్పష్టమవుతోంది. ‘మేం లడఖ్‌లో కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం.. కానీ, సీపీఏల్ఏ సుదీర్ఘమైన విస్తరణ, విస్తృతమైన నిర్మాణాలను నిలుపుదల చేశాం’ అని ఒక సీనియర్ అధికారి చెప్పారు. ‘కఠినమైన పర్వత ప్రాంతాల్లో పనిచేయడం మన సైనికులు అలవాటు చేసుకోడం, చైనా సైనికులు అటువంటి పరిస్థితిని తట్టుకోలేకపోవడంతో వారి ధైర్యాన్ని ప్రభావితం చేసింది’ అన్నారు. సరిహద్దుల్లో భారత్, చైనాలు ఒక్కొక్కరూ దాదాపు 50వేల మంది సైనికులు, హౌవిట్జర్లు, ట్యాంకులు, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. సరిహద్దుల్లో నివురగప్పిన నిప్పులా ఉంది. ఇరు సైనిక దళాలు క్రమం తప్పకుండా తమ సైనికులతో ఎత్తైన ప్రదేశాల్లోని క్లిష్టమైన ప్రాంతాల్లో గస్తీని కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో విమానాలు, డ్రోన్‌లతో పరిస్థితిని గమనిస్తున్నాయి. చైనా కూడా లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న 3,488 కి.మీ. ఎల్ఏసీ పొడవునా అనేక కొత్త వైమానిక స్థావరాలు, హెలిప్యాడ్‌లను అభివృద్ధి చేసింది. వీటికి తోడు ప్రధాన ఎయిర్ బేస్‌లైన హోతాన్, కాష్గర్, గర్గున్సా, లాసా-గొంగర్, షిగాట్సేలను పోరాట యోధులు, బాంబర్లతో అప్‌గ్రేడ్ చేసింది. ఒకవేళ భారత్ గగనతల దాడులు చేస్తే దీటుగా ఎదుర్కొనేందుకు రష్యాకు చెందిన S-400 ఉపరితల నుంచి గాల్లోకి ప్రయోగిచే క్షిపణులను గర్గున్సాలో చైనా మోహరించింది.


By September 27, 2021 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ladakh-standoff-china-shows-real-intent-more-pla-shelters-come-up-on-lac/articleshow/86545834.cms

No comments