Breaking News

నరేంద్ర గిరి స్వామి మృతి కేసు విచారణ.. యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం


అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ స్వామి అనుమానాస్పద మరణంపై విచారణను సీబీఐకి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది. సోమవారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని బాఘంబరి మఠం అతిథి గృహంలో ఆయన పైకప్పునకు వేలాడుతూ కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గదిని పరిశీలించగా 8 పేజీల లేఖ ఒకటి లభించింది. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించినా... సూసైడ్ నోట్‌‌లోని అంశాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం శిష్యులను విచారించడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ‘ముఖ్యమంత్రి సూచనలతో అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతిపై విచారణకు సిఫార్సు చేశాం’ అని యూపీ హోంశాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది. కాగా, ఈ కేసులో నరేంద్ర గిరి శిష్యుడు, ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆనంద్ గిరిని అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో ఆనంద్ గిరిని ఆశ్రమం నుంచి బహిష్కరించారు. తన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్‌గిరితో పాటు మరో ఆధ్య తివారి, అతడి కుమారుడు సందీప్‌ తివారి కారణమని నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అటు, ఈ ఘటనపై పలువురు సాధువులు అనుమానాలు వ్యక్తంచేయడంతో కేసు దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం తొలుత సిట్‌ ఏర్పాటు చేసింది. కానీ, మరింత లోతైన దర్యాప్తు కోసం సీబీఐకి బాధ్యతలను అప్పగించింది. నరేంద్ర గిరి మరణంపై పలు ఆధారాలను సేకరించామని, కుట్రదారులు తప్పించుకోలేరని సీఎం యోగి పేర్కొన్నారు. స్వామీజీ అనుమానాస్పద మరణంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రతిపక్ష కాంగ్రెస్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసింది. ఘటనలో వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ అన్నారు. పోస్ట్‌మార్టం నిర్వహించకుండా ఆత్మహత్యగా చెప్పాలని పోలీసులను ఎవరు ఒత్తిడి చేశారని ఆరోపించారు.


By September 23, 2021 at 10:42AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-cm-yogi-adityanath-recommends-cbi-probe-into-mahant-narendra-giri-death/articleshow/86447129.cms

No comments