Breaking News

Bihar మహిళపై లైంగిక దాడి.. ఊరిలోని మహిళలందరి బట్టలూ ఉతకాలని కోర్టు ఆదేశం!


మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి న్యాయస్థానం విచిత్రమైన శిక్షను విధించింది. ఊరిలోని మహిళందరి దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేయాలని ఆదేశించింది. వేధింపులకు గురిచేసినందుకు పశ్చాత్తాపంగా అందరి బట్టలు ఉచితంగా ఉతికాలని, నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బిహార్‌లోని మధుబని జిల్లా కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. వివరాల్లోకి వెళితే మధుబని జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువకుడు.. రజక వృత్తి చేసుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళను లైంగికంగా వేధించాడు. దీంతో అతడిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి, ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు జైల్లో ఉండగా.. బెయిల్ కోసం నిందితుడి తరఫున లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అదనపు జిల్లా న్యాయస్థానం జడ్జ్ అవినాష్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నిందితుడి తరఫున వాదనలు వినిపించిన లాయర్.. అతడు 20 ఏళ్ల యువకుడని, రజక వృత్తిలో ఉండి సమాజానికి సేవ చేస్తున్నాడని తెలిపారు. దాదాపు ఆరు నెలలుగా జైల్లో ఉన్నాడని వివరించారు. అంతేకాదు, ఫిర్యాదుచేసిన బాధిత మహిళ రాజీకి సిద్ధంగా ఉందని, ఈ విషయాన్ని అఫిడ్‌విట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు. ఈ వాదనలను విన్న న్యాయస్థానం నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళలందరి దుస్తులు ఉతికి, శుభ్రంగా ఇస్త్రీ చేయాలని షరతు విధించింది. ఈ పనికి ఎటువంటి డబ్బులు తీసుకోరాదని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేస్తామని నిందితుడికి న్యాయమూర్తి హెచ్చరించారు.


By September 23, 2021 at 07:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/molestation-accused-to-wash-womens-clothes-for-free-order-by-bihar-court/articleshow/86444074.cms

No comments