Breaking News

సీఎం చెంప పగలుగొడతానన్న కేంద్ర మంత్రి.. షాకిచ్చిన పోలీసులు


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించిన అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నారాయణ్ రాణేపై కేసు నమోదుచేయడం సంచలనంగా మారింది. కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్ జారీచేయడంతోపాటు కేసు విచారణలో భాగంగా రత్నగిరిలోని చింప్లున్‌కు దర్యాప్తు బృందం వెళ్లినట్టు పుణే పోలీసులు ధ్రువీకరించారు. అయితే, తనపై కేసు నమోదయిన విషయం తెలియదని కేంద్ర మంత్రి తెలిపారు. ‘నేను సాధారణ పౌరుడ్ని కాదు.. ఎటువంటి తప్పు చేయలేదు.. ఆగస్టు 15 గురించి ఎవరికైనా తెలియకపోతే అది నేరం కాదా? నేను చెంపదెబ్బ కొడతానని అన్నాను.. ఇది నేరం కాదు’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి రాయ్‌గఢ్ జిల్లా మహడ్‌లో మహారాష్ట్ర సీఎంను ఠాక్రేను ఏకవచనతో సంబోధిస్తూ.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై చెంప పగలుగొడతానని అన్నారు. దీనిపై నాసిక్ పట్టణ శివసేన చీఫ్ సుధాకర్ బాడ్జుజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్ జారీ చేయడం గమనార్హం. రాణే వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్‌ల‌ను అంటిస్తూ శివసేన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వివాదం మరింత రాజుకుంది. రాణే కుమారుడు నితేష్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దమ్ముంటే యువ సేన సభ్యులు మంత్రి జుహు నివాసం వద్ద ఆందోళన చేయాలని సవాల్ విసిరారు. మరోవైపు, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చాతుర్‌ష్రింగి పోలీస్ స్టేషన్‌లో యువసేన కేసు పెట్టింది. అటు, పాల్ఘార్ జిల్లాలోని వాసాయి, విరార్ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి నారాయణ్ రాణే జన్ ఆశీర్వాద్ యాత్రలో కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు కేసు నమోదయ్యింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి జన్ ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నందుకు రాణేతోపాటు బీజేపీ నేతలపై మానిక్ పూర్, తులింజ్, కాశిమీరా, వలీవ్,వసాయ్, విరార్, నాసిక్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. కరోనావైరస్ మహమ్మారి మధ్య భౌతిక దూరం నిబంధనలను ఉల్లంఘించినందుకు మంత్రిపై నాసిక్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు ఉత్తర్వులు సైతం జారీ చేశారు.


By August 24, 2021 at 12:10PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fir-against-union-minister-narayan-rane-for-slap-remarks-against-maharashtra-cm/articleshow/85586446.cms

No comments