Breaking News

ఓ ఎంపీ రేప్ చేశాడంటూ సుప్రీం వద్ద ఆత్మహత్యాయత్నం.. మహిళ మృతి


ఓ ప్రజాప్రతినిధి తనపై అత్యాచారం చేశాడంటూ గతవారం సర్వోన్నత న్యాయస్థానం ఎదుట ఓ మహిళ, ఆమె స్నేహితుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆ రోజే యువకుడు చనిపోయాడు. తాజాగా, ఢిల్లీలోని రామ్‌ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ మృతిచెందింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ స్నేహితుడితో కలిసి ఒంటికి నిప్పంటించుకుని 85 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.. మంగళవారం మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. శనివారం గేటు వద్ద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు (24).. తనపై బీఎస్పీ ఎంపీ అతుల్‌రాయ్‌ 2019లో అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. అతుల్‌రాయ్‌‌ను అరెస్ట్ చేయగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే, ఎంపీకి పోలీసులు సహకరిస్తున్నారని, మరో కేసులో కోర్టు తనకు వారెంటు జారీచేసిందని పేర్కొంటూ స్నేహితుడి (27)తో కలిసి సుప్రీంకోర్టు ఆవరణలో ఆమె నిరసనకు దిగి తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో వీడియో రికార్డు చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు. యువకుడు శనివారం మృతిచెందగా.. ఆమె మంగళవారం చనిపోయినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ దీపక్‌ యాదవ్‌ వెల్లడించారు. మరోవైపు, తనకు ప్రాణహాని ఉందని..కేసును అలహాబాద్‌ నుంచి ఢిల్లీ బదిలీ చేయాలని ఈ ఏడాది మార్చిలో ఆ మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే గతేడాది నవంబరులో బీఎస్పీ నేత సోదరుడు మహిళపై ఫోర్జరీ కేసు పెట్టాడు. ఈ కేసులో వారణాసి కోర్టు మహిళ, ఆమె స్నేహితుడికి ఈ నెలలోనే నాన్‌-బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. ఫేస్‌బుక్‌ లైవ్‌లోనూ ఆమె ఈ వారెంటు గురించి ప్రస్తావించారు. ఎంపీ, అతడి బంధువులతో పోలీసులు కుమ్మక్కయి తనకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని వాపోయింది. బల్లియా, వారణాసిలో తనకు అరెస్ట్ వారెంట్ జారీచేశారని ఆరోపించింది. కాగా, ఈ అంశాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ‘వారు కోరుకున్న గమ్యం, మేము చేరుకున్నాం... గత రెండేళ్లుగా వారు చేసిన ప్రయత్నాలు, వారి లక్ష్యాన్ని సాకారం చేయడానికి మేం ఇక్కడకు వచ్చాం’అని ఆమె రికార్డ్ చేసిన ప్రదేశాన్ని వెళ్లడించకుండానే వీడియోలో చెప్పింది. ఆమె స్నేహితుడు ‘ఎంపీ, అతడి కుటుంబం 2020 నవంబర్ నుంచి మమ్మల్ని చావాలని బలవంతం చేస్తున్నారు.. ఉత్తర ప్రదేశ్‌తో పాటు దేశంలోని అందరూ దీనిని వినాలని మేము కోరుకుంటున్నాం’ అని తెలిపాడు.


By August 25, 2021 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-woman-who-alleged-bsp-mp-atul-rai-dies-days-after-self-immolation-at-supreme-court-gate/articleshow/85613186.cms

No comments