Breaking News

‘బాలికను నేరుగా తాకకపోతే లైంగిక వేధింపులు కాదా.. బాంబే హైకోర్టు తీర్పు నిలిపేయండి’


శరీరంపై దుస్తులపై నుంచి బాలిక ఛాతిని తాకడం పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులుగా పరిగణించలేమని ఈ ఏడాది జనవరిలో నాగ్‌పూర్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ తీర్పును రద్దుచేయాలని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, జాతీయ మహిళా కమిషన్‌ పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా, మంగళవారం ఈ పిటిషన్‌పై జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగిల ధర్మాసనం విచారణ చేపట్టింది. సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. బాధితురాలిని నిందితుడు నేరుగా తాకనప్పుడు పోక్సో చట్ట నిబంధనల ప్రకారం లైంగిక వేధింపులుగా పరిగణించలేమని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయాలని అటార్నీ జనరల్‌ అభ్యర్థించారు. ఇది ప్రమాదకరమైన తీర్పని, అనేక తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పుపై బాలల హక్కుల సంఘాలు, న్యాయ నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున వాదనల వినిపించిన ఏజీ వేణుగోపాల్‌..‘బాంబే హైకోర్టు తీర్పు చాలా ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. దీన్ని అలుసుగా తీసుకుని ఎవరైనా చేతులకు సర్జికల్‌ గ్లౌజులు వేసుకుని బాలికల ప్రయివేట్ భాగాలను తాకితే దాన్ని నేరం కాదనే పరిస్థితి రావచ్చు.. ఈ కేసులో నిందితుడి చర్య లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. భవిష్యత్‌ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా, బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది’ అని పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో నిందితుడి తరఫున వాదనలు వినిపించేందుకు ఎవరూ హాజరుకాలేదు. దీంతో అతడి తరఫున సీనియర్‌ న్యాయవాది లేదా అడ్వొకేట్‌-ఆన్‌-రికార్డ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీస్‌ కమిటీని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయంలో అమికస్ క్యూరిగా సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ్‌ దవేను ఇప్పటికే నియమించినట్టు ధర్మాసనం వెల్లడించింది. తదుపరి విచారణను వచ్చే నెల 14కు వాయిదా వేసింది. మైనర్ బాలికపై 39 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాంబే హైకోర్టు (నాగ్‌పూర్ బెంచ్‌) జస్టిస్‌ పుష్పా గనేడివాలా ధర్మాసనం జనవరి 19న ఇచ్చిన తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తమయ్యింది. 2016లో నిందితుడు సతీష్‌.. బాధిత బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం చిన్నారి ప్రయివేట్ బాగాలను తాకి దుస్తులు విప్పడానికి యత్నించాడు. అతడి చేష్టలకు భయపడిపోయిన చిన్నారి కేకలు వేయడంతో తల్లి అక్కడికి చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు.


By August 25, 2021 at 07:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ag-venugopal-request-to-sc-cancel-for-bombay-high-court-nagpur-bench-pocso-verdict/articleshow/85612841.cms

No comments