Breaking News

డల్లాస్‌లోని మహాత్ముడి విగ్రహానికి ఓహియో సెనేటర్ ఘన నివాళి


ఒహియో రాష్ట్ర సెనేటర్ మంగళవారం మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ప్రపంచం మొత్తానికి గాంధీ మహాత్ముడు ఆదర్శమైన నాయకుడని, అయన చూపిన శాంతి బాట, సర్వమానవ శ్రేయస్సు ఎల్లవేళలా ఆచరణీయమని కొనియాడారు. డల్లాస్ నగరంలో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ మెమోరియల్‌ను నీరజ్ అంటానీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ప్రవాస భారతీయులనే కాకుండా.. స్థానిక అమెరికన్లతో మమేకమై అందరినీ ఒకే తాటిమీదకు తీసుకు వచ్చి అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ మెమోరియల్‌ను డల్లాస్ నగరంలో నిర్మించడంలో ప్రవాస భారతీయుడు డాక్టర్ తోటకూర ప్రసాద్ చేసిన అవిరళ కృషి ఎంతో స్పూర్తిదాయకమని అన్నారు. దీని సాకారానికి సహకరించిన వారందరికీ నీరజ్ టాండన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘భారత సంతతికి చెందిన రెండో తరం అమెరికా దేశ రాజకీయాలలో ముందంజలో ఉందన్నారు. ఇందుకు ప్రతీక గుజరాత్ మూలాలున్న నీరజ్ అంటానీ అన్నారు. 23 ఏళ్ల వయసులోనే ఒహియో రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి, రిపబ్లిక్ పార్టీ తరఫున మూడు సార్లు రాష్ట్ర ప్రతినిధిగా ఎన్నికయ్యారన్నారు. ఆరేళ్ల పాటు ఆ పదవిలో పనిచేసి, ఇటీవలే ఒహియో సెనేట్‌కు ఎన్నికై చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఒహియో రాష్ట్ర సెనేటర్‌గా నీరజ్ ఈ పదవిలో 2024 డిసెంబర్ 31 వరకు కొనసాగుతారు. అమెరికా రాజకీయాల్లో రాణిస్తున్న ప్రవాస భారతీయులలో నీరజ్ అతి పిన్నవయస్కుడు కావడం గర్వించదగ్గ విషయమని డాక్టర్ తోటకూర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు, మహాత్మాగాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వాల, బోర్డు అఫ్ డైరెక్టర్ రాంకీ చేబ్రోలు పాల్గొన్నారు. కాగా, డల్లాస్ నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని 2014లో ఏర్పాటుచేశారు.


By August 05, 2021 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/nri/ohio-state-senator-niraj-antani-pays-floral-tribute-to-mahatma-gandhi-statue-at-dallas/articleshow/85058241.cms

No comments