Breaking News

పెళ్లికాకుండా తల్లయితే.. బిడ్డ తండ్రి ఎవరో చెప్పాల్సిన బాధ్యత మహిళకు ఉందా? హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


‘వివాహం కాకుండానే బిడ్డలకు జన్మనిస్తే.. వారి తండ్రి ఎవరో వెల్లడించాల్సిన బాధ్యత మహిళకు ఉంటుందా? ఆ వ్యక్తి పేరు చెప్పాలని ఒత్తిడికి గురిచేయవచ్చా? బలవంతంగానైనా పేరు చెప్పించాల్సిందేనన్న న్యాయ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అత్యాచారానికి గురైనట్లు కూడా ఫిర్యాదు చేయని పరిస్థితుల్లో... సమాధానం తెలిసినా బహిర్గతం చేయని ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చా?’’అంటూ గుజరాత్‌ హైకోర్టు పలు ధర్మ సంకటమైన ప్రశ్నలను లేవనెత్తింది. మైనర్ బాలిపై అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్షను విధించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయి న్యాయబద్ధమైన పలు సందేహాలను వ్యక్తం చేశారు. వివాహం కాకుండానే, తన ఇష్టప్రకారం బిడ్డను కనేందుకు గర్భందాల్చిన మహిళపై ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని చర్యలు తీసుకోగలమని హైకోర్టు ప్రశ్నించింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఎవరితో కలిసి జీవిస్తున్నారనేది సమస్య కాబోదని వ్యాఖ్యానించారు. ‘నగరాలు, మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో ఈ తరహా ఉదంతాలను ‘ఆధునికం’ అని సమర్థిస్తారు... అదే గ్రామాల్లో తీవ్ర విమర్శలు వస్తాయి... కొన్ని గిరిజన తెగల్లో బిడ్డను కనటానికి మహిళకు వివాహ బంధం తప్పనిసరికాదు.. 18ఏళ్ల నిండకుండానే తల్లికావడం అక్రమమైన వ్యవహారంగా పరిగణించరు.. ప్రసవం కోసం వచ్చిన మహిళను ఆస్పత్రిలో వైద్యులు ఆ బిడ్డ తండ్రి ఎవరని అడిగితే..‘నాకు తెలియదు. చెప్పడం ఇష్టంలేదు. తెలిసినా చెప్పడానికి ఆసక్తిలేదు’ అన్నప్పుడు ఎదురయ్యే పరిస్థితి ఏమిటి? ఇలాంటి కేసుల్లో ఏ చట్టం ఉల్లంఘనకు గురయ్యిందని భావించగలం’ అని జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయ్‌ సందేహం వెలిబుచ్చారు. కేసు వివరాల్లోకి వెలితే.. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన మైనర్ బాలిక ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. తన ఇష్టప్రకారమే ఇంటి నుంచి వచ్చి ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నట్లు తెలిపింది. మైనర్‌గానే మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికి ఆమె వయస్సు 16 ఏళ్లు.. కాగా.. తర్వాత మరో రెండేళ్ల లోపే రెండో బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది మార్చి 24తో ఆమెకు 18 ఏళ్లు పూర్తవడంతో ఆ మర్నాడే మార్చి 25న సహజీవనం చేసిన వ్యక్తినే వివాహం చేసుకోవాల్సి ఉంది. అయితే, ఇంతలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల వాయిదాపడింది. చివరకు ఈ ఏడాది జనవరిలో వివాహ బంధంతో ఇరువురూ ఒక్కటయ్యారు. కానీ, రెండో బిడ్డ పుట్టిన తర్వాత బాలిక తండ్రి... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్‌ అయిన తన కుమార్తెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. ఈ కేసును విచారించిన దిగువ కోర్టు ఆగస్టు 19న తీర్పు వెలువరించింది. నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 376(అత్యాచారం), పోక్సో చట్టం ప్రకారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. దానిని నిందితుడు హైకోర్టులో సవాల్‌ చేశాడు.


By August 24, 2021 at 01:31PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cannot-ask-a-woman-who-her-childs-father-is-gujarat-high-court/articleshow/85588087.cms

No comments