Breaking News

కొడుకు అనుమానాస్పద మృతి.. 22 రోజులుగా శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచిన తండ్రి


కుమారుడి మరణంపై అనుమానాలున్నాయని, నిజం నిగ్గుతేలేదాకా అంత్యక్రియలు నిర్వహించలేదని భీష్మించుకు కూర్చున్న ఓ మంత్రి.. మృతదేహాన్ని 22 రోజులు పాటు ఫ్రిజ్‌లోనే ఉంచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పుర్‌ జిల్లా మజావున్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివాంక్‌ పాఠక్ (32) అనే యువకుడు ఆగస్టు 1న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం తండ్రి శివప్రసాద్ పాఠక్‌కు మృతదేహాన్ని అప్పగించారు. అయితే, కొడుకును కోడలే హత్యచేసిందని ఆరోపిస్తూ.. నిజం బయటకుపడే వరకూ అంత్యక్రియలు నిర్వహించబోనని మృతదేహాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివాంక్ పాఠక్ ఢిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌లో 2011 నుంచి పనిచేస్తున్నాడు. అక్కడ ఉద్యోగం చేసే గుర్లీన్‌ కౌర్‌ అనే యువతితో పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో 2013లో వారు వివాహం చేసుకున్నారు. అయితే ఈ నెల 1న శివాంక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన తండ్రి.. అంత్యక్రియలు నిర్వహించలేదు. కొడుకు మృతిపై అనుమానాలున్నాయని, ఆస్తి కోసం కోడలే హత్య చేసి ఉంటుందని ఆరోపించారు. నిజాలు బయటపడేవరకు దహన సంస్కారాలు నిర్వహించబోనని శవాన్ని ఇంట్లోని డీప్‌ ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ సోమవారం పోలీసు యంత్రాంగంతో చర్చలు జరిపారు. అనంతరం శివాంక్‌ మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా ప్రధాన మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన డాక్టర్ల బృందం మంగళవారం ఆ శవానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక రావాల్సిఉంది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని స్థానిక కోర్టును శివప్రతాప్ ఆశ్రయించారు. బుధవారం దీనిపై కోర్టు నిర్ణయం వెలువరించనుంది. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన శివ ప్రసాద్.. చనిపోవడానికి కొద్ది రోజుల ముందే తన కుమారుడు ఫోన్ చేసి తనను చంపడం లేదా క్రిమినల్ కేసులో ఇరికించడానికి చూస్తున్నారని చెప్పినట్టు తెలిపాడు. రైల్వేలో పనిచేసే శివాంక్ సోదరుడు ఇషాంక్ మాట్లాడుతూ.. ఢిల్లీ పోలీసులు తన అన్న మరణంపై ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదని అన్నారు. అలాగే పోస్ట్‌మార్టం కాపీ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఢిల్లీలోని మోతీనగర్‌లో ఉండే మా సోదరి పూనమ్ మిశ్రాకు వదిన గుర్లీన్ కౌర్ ఫోన్‌చేసి.. శివాంక్ సొమ్మసిల్లి పడిపోయాడని చెప్పిందని తెలిపారు. ఆస్పత్రికి ఆలస్యంగా తీసుకెళ్లారని, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారని పేర్కొన్నారు.


By August 25, 2021 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-man-preserves-his-sons-dead-body-in-deep-freezer-for-22-days/articleshow/85614127.cms

No comments