Breaking News

దేశంలోని రెండొంతుల జనాభాలో యాంటీబాడీలు.. మరో 40 కోట్ల మందికి కోవిడ్ ముప్పు


దేశంలో మూడింట రెండొంతుల మంది కొవిడ్‌ బారినపడినట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) నాలుగో సిరో సర్వేలో వెల్లడయ్యింది. దేశంలోని 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్‌-జులై మధ్య ఈ సీరో సర్వేను నిర్వహించినట్టు డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. ఇంతకు ముందు నిర్వహించిన సర్వేలకు భిన్నంగా ఈసారి 6-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలు సహా మొత్తం 28,975 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించినట్లు ఆయన పేర్కొన్నారు. వీరిలో 7,252 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది ఉన్నారన్నారు. గతంలో మూడసార్లు సీరో సర్వే నిర్వహించిన జిల్లాల్లోనే తాజా అధ్యయనం జరిగింది. ఈ సర్వేలో పాల్గొన్న పెద్ద వయస్కుల్లో 12,607 మంది (62.2 శాతం) టీకా తీసుకోలేదని, 5,038 మంది (24.8 శాతం) ఒక డోసు, 2,631 మంది (13 శాతం) రెండు డోసులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తంగా 67.6 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు వెల్లడించారు. 6-9 ఏళ్ల వయస్సు వారిలో 57.2 శాతం మంది, 10-17 ఏళ్ల వయస్సువారిలో 61.6 శాతం, 18-44 వయస్సు వారిలో 66.7 శాతం, 45-60 ఏళ్ల వయస్సువారిలో 77.6 శాతం, 60 ఏళ్ల పైబడిన వారిలో 76.7 శాతం మందిలో యాంటీబాడీలు గుర్తించినట్టు పేర్కొన్నారు. పురుషుల్లో 65.8 శాతం, మహిళల్లో 69.2 శాతం మందిలో సీరో పాజిటివిటీ రేటు కనిపించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 66.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 69.6 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు వివరించారు. ఇప్పటివరకు టీకా తీసుకోని వారిలో 62.3 శాతం, ఒక డోసు తీసుకున్నవారిలో 81 శాతం, రెండు డోసులు తీసుకున్నవారిలో 89 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని బలరాం భార్గవ తెలియజేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందిలో 85.2 శాతం మందిలో సీరో పాజిటివిటీ కనిపించిందని చెప్పారు. వైద్యుల్లో ఇంకా పది శాతం మంది టీకాలు వేసుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలను బట్టి ఇప్పటి వరకు దేశంలో మూడింట రెండొంతుల మంది కొవిడ్‌కు గురైనట్లు తెలుస్తోందని అన్నారు. ఇంకా 40 కోట్ల మందికి కోవిడ్ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. యాంటీబాడీలు తక్కువ ఉన్న ప్రాంతాల్లో కేసులు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం కనిపించిన సీరో పాజిటివిటీ రేటు ఆశాజనకంగానే ఉన్నా అప్రమత్తంగానే ఉండాలని బలరాం భార్గవ స్పష్టంచేశారు. అయితే, జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ సర్వే స్థానిక పరిస్థితులను వెల్లడించలేదని, అందువల్ల రాష్ట్రాలు సొంతంగా సీరో సర్వే నిర్వహించుకోవాలని సూచించారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు యాంటీబాడీలు కనిపించని 40 కోట్ల మంది కోవిడ్ ద్వారా కాకుండా టీకా తీసుకోవడం వల్ల వాటిని తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికీ ప్రతి ముగ్గురిలో ఒకరు కొవిడ్‌-19కు గురవడానికి అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


By July 21, 2021 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/68-of-indians-have-covid-19-antibodies-1/3rd-vulnerable-say-icmr-sero-survey/articleshow/84604831.cms

No comments