Breaking News

లక్ అంటే అతడిదే.. ఒక్క చేప రూ.72 లక్షలకు అమ్ముడయ్యింది!


అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. ఓ అరుదైన చేప మత్స్యకారుడి వలకు చిక్కడంతో ఆయన పంట పడింది. రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. ఈ చేప ఏకంగా 7.2 మిలియన్ల (72 లక్షలు)కు అమ్ముడయ్యింది. పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లకు చెందిన మత్స్యకారుడు సాజిద్‌ హాజీ అబూబాకర్‌ పట్టిన ఒకే ఒక చేప రూ.72 లక్షలు తెచ్చిపెట్టింది. అరుదైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతికి చెందిన 48 కిలోల చేప అబాబాకర్ వలకు చిక్కింది. ఐరోపా, చైనాలో ఈ క్రోకర్‌ జాతి చేపలకు అత్యధిక డిమాండ్‌ ఉంది. వాస్తవానికి చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయిస్తారు. కానీ, క్రోకర్‌ జాతి భిన్నమైంది. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన చికిత్సల్లోనూ ఉపయోగిస్తారు. అందుకే దీనికి అంతటి డిమాండ్. నిజానికి వేలంలో ఇంకా ఎక్కువ ధరకు ఈ చేప అమ్ముడుపోయింది. రూ 86.4 లక్షల వరకు వెళ్లినా.. పెద్ద మొత్తంలో వేలంలో దక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. దీంతో అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు. గతవారం కూడా గ్వాదర్‌ తీరంలోనే ఒక మత్స్యకారుడి వలకు క్రోకర్‌ జాతి చేప చిక్కగా.. వేలంలో అది రూ.7.8 లక్షలకు అమ్ముడైంది. ఈ చేపలు జెవానీ సహా చుట్టుపక్కల తీరానికి వేసవికాలంలో సంతానోత్పత్తి కోసం చేరుకుంటాయని జలచర నిపుణులు పేర్కొంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడయిన చేపను తాను ఎప్పుడూ చూడలేదని గ్వాదర్ మత్స్యకారుల సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ అహ్మద్ నదీమ్ అన్నారు. ఈ చేప 8.6 మిలియన్లకు అమ్ముడయినా.. కొంత రాయితీ ఇవ్వడంతో 7.2 మిలియన్లు దక్కిందన్నారు.


By June 01, 2021 at 06:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-fisherman-caught-a-rare-fish-which-was-sold-for-a-whopping-rs7-2-million/articleshow/83133714.cms

No comments