Breaking News

గంగలో మృతదేహాలు: కేంద్రానికి నోటీసులు.. NHRC ఘాటు వ్యాఖ్యలు


గత నాలుగు రోజులుగా గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తమకు నాలుగు వారాల్లోపు నివేదికను అందజేయాలని ఆదేశించింది. ‘ఈ విషయంలో స్థానిక అధికారులు విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. పవిత్ర గంగానదిలో మృతదేహాలను పడేయటం గంగా ప్రక్షాళన ప్రాజెక్టు నిబంధనలను ఉల్లంఘించడమే.. అవి కొవిడ్‌ బాధితుల మృతదేహాలుగా మాకు అందిన ఫిర్యాదుల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. గంగా నదిలో కాలుష్యాన్ని కలిగించే ఏ ప్రాజెక్ట్ లేదా ప్రక్రియ లేదా కార్యకలాపాలను ఏ వ్యక్తి చేయకూడదు లేదా కొనసాగించకూడదు.. ఇదే నిజమైతే గంగానదిపై ఆధారపడి బతుకుతున్న అందరి జీవితాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సంఘటన సమాజానికి సిగ్గుచేటు.. అంతేకాదు ఇది మృతిచెందిన వ్యక్తుల మానవహక్కుల ఉల్లంఘనే ’ అని జాతీయ మానవహక్కుల కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సంఘటనలను నివారించడంలో విఫలమైన నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కమిషన్‌ను కోరారు. కొట్టుకువచ్చిన ఘటనపై సిట్టింగ్‌ లేదా రిటైర్డ్‌ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌, విశాల్‌ ఠాక్రే గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.


By May 14, 2021 at 11:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nhrc-issues-notice-to-centre-bihar-up-over-bodies-floating-in-ganga-river/articleshow/82626085.cms

No comments