Breaking News

నివ్వెరపోయే ఘటన.. జర్నలిస్ట్ అరెస్ట్‌కు యుద్ధ విమానం పంపిన ప్రభుత్వం


ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్ట్‌ను పట్టుకోవడం కోసం విదేశీ విమానాన్ని హైజాక్‌ చేయాలని స్వయంగా అధ్యక్షుడు ఆదేశించి, యుద్ధవిమానాన్ని పంపి మరీ దానిని దారిమళ్లించడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ప్రపంచదేశాలన్నీ తీవ్రం ఆగ్రహం వ్యక్తం జేస్తున్న సంఘటనకు బెలారస్‌ ప్రభుత్వం కారణమయ్యింది. ‘ప్రభుత్వ ఉగ్రచర్య’గా అభివర్ణిస్తున్న ఈ చర్యలకు బెలారస్ ప్రభుత్వం పూనుకోడానికి జర్నలిస్ట్ వ్యతిరేకంగా వార్తలు రాయడమే కారణం. రోమన్‌ ప్రొటాసెవిచ్‌ (26) అనే జర్నలిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేక ఆందోళనల గురించి వార్తలు రాసి పాలకుల ఆగ్రహానికి గురికావడంతో దేశం విడిచి పారిపోయాడు. తాజాగా ఆదివారం ఆ విలేకరి ఏథెన్స్‌ నుంచి మరో దేశానికి విమానంలో బెలారస్‌ మీదుగా వెళుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బెలారస్‌ ప్రభుత్వం దానిపైకి యుద్ధ విమానాన్ని పంపింది. విమానంలో బాంబు ఉందని సమాచారం అందిందంటూ బలవంతంగా తమ దేశ రాజధానికి దారి మళ్లించింది. విమానం దిగిన వెంటనే జర్నలిస్ట్‌ను అరెస్టు చేసింది. తర్వాత ఎటువంటి బాంబు లేదంటూ అని విమానం వెళ్లటానికి అనుమతిచ్చింది. ఓ విమర్శకుడి అరెస్టు కోసం బెలారస్‌ ప్రభుత్వం చేసిన ఘనకార్యంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది జరిగిన బెలారస్‌ అధ్యక్ష ఎన్నికలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో అక్రమాలకు పాల్పడ్డారని, వెంటనే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే, ఈ ఆందోళనలను అధ్యక్షుడు లుకాషెంకో వాటిని అణచివేశారు. ఈ అల్లర్ల వెనక జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల హస్తం ఉందంటూ వారి అరెస్టులకు ఆదేశాలిచ్చారు. వారు ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారంటూ పోలీసులు కేసులు నమోదుచేశారు. వీరిలో జర్నలిస్టు రోమన్‌ ప్రొటాసెవిచ్‌, మరికొందరు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ఆయన పోలండ్‌ తలదాచుకుంటున్నాడు. అయితే ఆదివారం ప్రొటాసెవిచ్‌.. ఏథెన్స్‌ నుంచి లిథుయేనియాకు ర్యాన్‌ఎయిర్‌ విమానంలో వెళుతున్నట్లు బెలారస్‌ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఆ విమానం తమ గగనతలంలోకి రాగానే... బెలారస్‌ యుద్ధ విమానాన్ని పంపింది. విమానంలో బాంబు ఉందని తమకు సమాచారం వచ్చినట్లు చెప్పి, ఆ విమానాన్ని బలవంతంగా దారి మళ్లించి రాజధాని మింక్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపింది. ఆ తర్వాత రోమన్‌ను, అతని గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. సోదాలు చేస్తున్నట్టు తతంగం నడిపి, బాంబు ఏమీ లేదని నిర్ధరించి.. విమానాన్ని పంపింది. అయితే, విమానాన్ని బెలారస్‌‌కు మళ్లిస్తున్నామని సిబ్బంది ప్రకటించడంతో రోమన్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నాడు. ఆ దేశంలో తాను మరణశిక్ష ఎదుర్కొంటున్నాని చాలా భయపడ్డాడని తోటి ప్రయాణికులు తెలిపారు.


By May 25, 2021 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/outrage-as-belarus-forces-plane-to-land-arrests-journalist-pratasevich-on-board/articleshow/82929496.cms

No comments