Breaking News

పేదలకు రెండు నెలల ఫ్రీ రేషన్.. వారికి రూ.5,000 ఆర్ధిక సాయం: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం


ఢిల్లీలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. తొలుత వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించగా.. మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో పొడిగిస్తూ వస్తున్నారు. లాక్‌డౌన్ మొదలై రెండు వారాలు గడిచిపోగా.. మూడో వారంలోకి ప్రవేశించింది. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలను ఆదుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పేదలకు రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ అందజేయనున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలోని 72 లక్షల కార్డుదారులకు రాబోయే రెండు నెలలు ఉచితంగా రేషన్ అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా రేషన్ ఉచితంగా అందజేస్తామని, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీ స్పష్టం చేశారు. రేషన్ ఉచితంగా ఇస్తామంటే లాక్‌డౌన్ రెండు నెలలు కొనసాగుతుందని అనుకోవద్దని స్పష్టతనిచ్చారు. అలాగే, ఢిల్లీలోని ఆటోరిక్షాలు, ట్యాక్సీ డ్రైవర్లకు కూడా రూ.5,000 ఆర్ధిక సాయం ప్రకటించారు. కరోనా కాలంలో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్న డ్రైవర్లు ప్రతి ఒక్కరికీ చిరు సాయంగా రూ.5,000 చొప్పున అందజేస్తామని తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల కిందట ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్‌లో ఆక్సిజన్ లేక ఎనిమిది మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో అదే ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్‌ కూడా ఉన్నారు. అటు, కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు జరపడం కూడా కష్టతరంగా ఉంది. శ్మశనాల్లో సామర్థ్యానికి మించి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల కోసం రెండు మూడు రోజులు నీరిక్షించే పరిస్థితి నెలకుంది. రోజురోజుకు విజృంభిస్తుండటంతో ప్రత్యేక కొవిడ్‌ కేంద్రాల నిర్వహణ, ఆక్సిజన్‌ సరఫరా బాధ్యతలు ఆర్మీ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర రక్షణశాఖ మంత్రికి లేఖ రాసింది.


By May 04, 2021 at 12:59PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/free-ration-to-72-lakh-people-rs-5000-financial-aid-to-auto-taxi-drivers-says-delhi-cm-arvind-kejriwal/articleshow/82384387.cms

No comments