Breaking News

కరోనాతో అనాథలైన పిల్లలకు నెలకు రూ.5వేలు, ఉచిత విద్య.. సీఎం ప్రకటన


యావత్‌ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పటి వరకు 33 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. హాయిగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఈ మహమ్మారి కుటుంబాలకు కుటుంబాలను బలితీసుకుంటోంది. ఒకే కుటుంబంలోని ఇద్దరు.. ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. కొన్నిచోట్ల ఇంట్లో చనిపోయిన వారి అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దంపతులు, కూతుళ్లు, కుమారులు, అత్తమామలు, సమీప బంధువులను ఈ రక్కసి బలి తీసుకుంటోంది. ఇంట్లో ఒకరికి వస్తే.. మిగిలిన వారు హడలిపోతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి చిన్నారులను ఆదుకోడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయి అనాథులైన చిన్నారులకు నెలకు రూ.5,000 పెన్షన్ అందజేయనున్నట్టు ముఖ్యమంత్రి గురువారం ప్రకటించారు. అలాగే, బాధిత కుటుంబాల్లోకి చిన్నారులకు ఉచిత విద్య, ఉచిత రేషన్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతేకాదు, ఎవరైనా వ్యాపారాలు చేయాలనుకుంటే ప్రభుత్వ గ్యారెంటీతో రుణ సౌకర్యం కూడా కల్పిస్తామని శివ్‌రాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌లో రోజువారీ కేసులు భారీగా నమోదుకావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తొలుత భోపాల్, గ్యాలియర్ వంటి నగరాల్లో కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు అమలుచేశారు. అయితే, వైరస్ అదుపులోకి రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా మహమ్మారిని కట్టడిచేయడానికి ప్రభుత్వం మే 15 వరకు లాక్‌డౌన్ విధించింది.


By May 13, 2021 at 12:48PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/monthly-pension-free-education-to-children-of-covid-19-deceased-parents-in-madhya-pradesh/articleshow/82598953.cms

No comments